‘జువారీ’కి హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-05-06T08:53:54+05:30 IST

పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, తుమ్మలపల్లె గ్రామంలోని జువారీ పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు

‘జువారీ’కి హైకోర్టులో ఊరట

పరిశ్రమ మూతకు కాలుష్య మండలి జారీచేసిన ఉత్తర్వులు నిలిపివేత


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, తుమ్మలపల్లె గ్రామంలోని జువారీ పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జూన్‌ చివరి వారానికి వాయిదా వేసింది. పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎర్రగుంట్ల జువారీ సిమెంట్‌ ప్లాంట్‌ అధిపతి గంటా నాగభూషణ్‌రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరావు వాదనలు వినిపిస్తూ... చట్టనిబంధనలు అనుసరించకుండా నోటీసులు జారీ చేశారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పీసీబీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. కంపెనీకి ముందుగా నోటీసు ఇచ్చి.. కాలుష్య నిబంధనలు సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-06T08:53:54+05:30 IST