వీడని జ్యోతిరెడ్డి మృతి మిస్టరీ
ABN , First Publish Date - 2022-01-20T17:07:41+05:30 IST
సినీ జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతి మిస్టరీ వీడలేదు. మంగళవారం షాద్నగర్ రైల్వేస్టేషన్లో ఆమె..
మృతదేహం నెల్లూరుకు తరలింపు.. అక్కడే అంత్యక్రియలు
షాద్నగర్ రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న ఏకైక సీసీ కెమెరా
హైదరాబాద్ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సినీ జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతి మిస్టరీ వీడలేదు. మంగళవారం షాద్నగర్ రైల్వేస్టేషన్లో ఆమె ప్రమాదానికి గురై మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు స్వగ్రామం నెల్లూరుకు మృతదేహాన్ని తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
రైల్వేపోలీసుల నిర్లక్ష్యం
జ్యోతిరెడ్డి మరణానికి కారణాలేంటనే విషయంలో ఆమె సహచరులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. సరైన సమాధానం ఇవ్వకుండానే దాటవేత ధోరణితో ప్రవర్తించారని... మహిళలను సైతం అగౌరవంగా సంబోధిస్తూ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారని వారు ఆరోపించారు. సీసీ ఫుటేజీ చూపమని అడిగినా... ఒకే కెమెరా పని చేస్తోందని.. అందులో రికార్డు అయిన సీసీ ఫుటేజీలో కూడా స్పష్టత లేదని వాపోయారు. రైలు కదులుతున్నప్పుడు ఆమె కింద పడ్డారని, ప్లాట్ ఫామ్పై దిగిన తర్వాత రైలు కదులుతుంటే ఎక్కడానికి వెళ్లి జారి పడ్డారని... ఇలా పలు రకాలుగా పోలీసులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.