పేరుకుపోతున్న ఎర్రబంగారం నిల్వలు

ABN , First Publish Date - 2020-10-28T08:57:14+05:30 IST

స్మగ్లర్ల నుంచి అధికారులు పట్టుకున్న ఎర్రచందనం నిల్వలు పేరుకుపోతున్నాయి.

పేరుకుపోతున్న ఎర్రబంగారం నిల్వలు

 తుప్పుపడుతున్న వాహనాలు

 వేలానికి అనుమతించని ప్రభుత్వం


రైల్వేకోడూరు, అక్టోబరు 27: స్మగ్లర్ల నుంచి అధికారులు పట్టుకున్న ఎర్రచందనం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆరు నెలల నుంచి వేలం వేయకపోవడంతో దుంగలతో పాటు పట్టుకున్న వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. శేషాచలం, వెలుగొండ, పెనుశిల, పాలకొండ అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం సంపద అపారంగా ఉంది. స్మగ్లర్లు ఈ వృక్ష సంపదను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు సంపాదించారు. అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం సంపదను అటవీశాఖ, టాస్క్‌ఫోర్సు, స్థానిక పోలీసులు ఇప్పటివరకు వేలాది టన్నుల కొద్దీ దుంగలు పట్టుకున్నారు.


అలాగే వాహనాలు కూడా పట్టుకున్నారు. ఎర్ర బంగారానికి విలువ ఉన్నా రెండేళ్లుగా వేలానికి నోచుకోలేదు. వాహనాలు కూడా ఎండకు ఎండి, వానకు తడిచి తుప్పుపడుతున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో రెండు రేంజిలు ఉన్నాయి.  రెండేళ్లలో రైల్వేకోడూరు రేంజి పరిధిలో 15 వాహనాలు వేలానికి నోచుకోలేదు. ఎర్రచందనం దుంగలు సుమారుగా 7.5 టన్నులు తిరుపతి గోడౌన్‌కు తరలించారు. అదేవిధంగా బాలపల్లె రేంజి పరిధిలో 120 వాహనాలు వేలానికి నోచుకోలేదని అధికారులు అంటున్నారు. సుమారు 34.7 టన్నుల ఎర్రచందనం దుంగలను తిరుపతి గోడౌన్‌కు తరలించారు. రైల్వేకోడూరు పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో సుమారు 5 టన్నుల ఎర్రదుంగలు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్సు ఏర్పాటు నుంచి 60 టన్నుల బరువు గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే రెండేళ్లుగా రాజంపేట డివిజన్‌ అటవీశాఖ పరిధిలో 25 టన్నుల ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు.


తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో వేలాది టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాహనాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎర్రచందనం దుంగలతో పాటు, వాహనాలు వేలం పాటలు వేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చేశారని పలువురు అంటున్నారు. వేలానికి నోచుకోకపోవడంతో వాహనాల టైర్లు, వివిధ రకాల వాహనాల సామాగ్రి దెబ్బతింటున్నాయి. పట్టుబడ్డ వాహనాలకు ఆర్‌టీవో అధికారి వచ్చి పరిశీలించి వాహనాలు దొంగవా కాదా అని నిర్ధారించిన అనంతరం వేలానికి అనుమతి వస్తుంది. పేపర్‌ ప్రకటన కూడా ఇస్తారు. తర్వాత తేదీ ఖరారు చేసి వాహనాలు తిరుపతి కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ గతంలో వేలం వేసేవారు. అయితే ఈ ఏడాది మార్చిలో వేలానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా వైరస్‌ రావడంతో వేలానికి నోచుకోలేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే చాలా వాహనాలు, ఎర్రచందనం దుంగలు వేలం వేయవచ్చని అధికారులు అంటున్నారు. 

Updated Date - 2020-10-28T08:57:14+05:30 IST