వర్రీ
ABN , First Publish Date - 2020-10-29T09:13:15+05:30 IST
ఆరుగాలం కష్టించే అన్నదాతకు భారీ వర్షాలు కష్టాలను తెచ్చి పెట్టాయి. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటకు గింజ దశలో ఎర్రతెగులు సోకింది.
వరి పంటకు ఎర్రతెగులు
ఆందోళనలో అన్నదాతలు
సత్వర చర్యలతో నివారణ
అంటున్న వ్యవసాయాధికారులు
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 28: ఆరుగాలం కష్టించే అన్నదాతకు భారీ వర్షాలు కష్టాలను తెచ్చి పెట్టాయి. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటకు గింజ దశలో ఎర్రతెగులు సోకింది. దీంతో ఇక పంట దిగుబడి ఎలా అంటూ అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. జమ్మలమడుగు మండలంలోని దేవగుడి, గొరిగెనూరు, ధర్మాపురం, సలివెందుల, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె, అంబవరం, పూ ర్వపు బొమ్మేపల్లె, ఒంటిమిద్దె తదితర ప్రాంతాల్లో రైతులు విస్తారంగా సుమారు 900 హెక్టార్లలో వరి పంట సాగు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరి పంట లో వర్షపునీరు చేరి ఎర్రతెగులు సోకగా మరి కొన్న చోట్ట పంట కోతకు గురైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట కంకిదశకు చేరి పచ్చగా పొలాలు దర్శనిమస్తున్నా దిగు బడి కష్టంగా ఉంటుందని రైతులు వాపొతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సత్వర చర్యలతో ఎర్ర తెగులు నివారణ.. చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయాధికారి, జమ్మలమడుగు
వరి పంటకు అధికంగా యారియా వాడకం వల్ల తెగులు వస్తుంది. అలాగే వర్షపు నీరు బాగా నిలువ ఉండడం వల్ల ఎర్రతెగులు సోకింది. దీని నివారణకు పొటాష్ ఎకరాకు 30 కేజీలు వాడడంతోపాటు ప్లాం టా మైథీన్ ఒక ట్యాంకు నీటిలో 10 గ్రాములు కలిపి వాడాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా నశించి పోయి ఎర్రతెగులు తగ్గిపోతుం ది. కాగా ఇటీవల జమ్మలమడుగు మండలంలో కడప వ్యవసాయాధికారులు, స్థానిక అధికారులు పంట పొలాలను పరిశీలించగా సుమారు 57 ఎకరాలు వరి పంట కోతకు గురై నష్టం వాటిల్లింది. ఇప్పటికే పంట నష్టంపై నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపించాం.