రోడ్డు ప్రమాదంపై ఆర్డీఓతో విచారణ చేయించాలి
ABN , First Publish Date - 2021-12-08T05:48:02+05:30 IST
గుమ్మఘట్ట మండలం గోనబావి క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆర్డీఓతో మెజిస్టీరియల్ విచారణ చే యించి, బాధితులకు న్యాయం చే యాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి కాలవ డిమాండ్
రాయదుర్గం, డి సెంబరు 7: గుమ్మఘట్ట మండలం గోనబావి క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆర్డీఓతో మెజిస్టీరియల్ విచారణ చే యించి, బాధితులకు న్యాయం చే యాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆయనతోపాటు టీడీపీ కళ్యాణదుర్గం ఇనచార్జ్ ఉమామహేశ్వరనాయుడు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అత్యంత వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారకుడైన వైసీపీ నాయకుడు గోనబావి ప్రతా్పరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులతో కలిసి ఆస్పత్రి ముందు ఉన్న ప్రధాన రహదారిపై గంటకుపైగా బైఠాయించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి 30 గంటలవుతున్నా ఆర్డీఓ విచారణ జరపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోందన్నారు. పోలీసులు దుప్పటి పంచాయితీలు చేయడం దుర్మార్గమన్నారు. మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని టీడీపీ పోరాడుతుంటే పోలీసులు.. కార్యకర్తలపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి దౌర్జన్యకాండను వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఆర్థికసాయం అందించాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి ఆయన ఆర్డీఓకు ఫోన చేసి, విచారించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. 24 గంటల్లో విచారించి బాధితులను పరామర్శించి న్యాయం చేస్తానని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుతీప్రసాద్, మండల కన్వీనర్ గిరిమల్లప్ప, పార్టీ అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తమ్, కాలవ సన్నణ్ణ, సిమెంటు శీనా, మురళి పాల్గొన్నారు.