ఉల్లంఘనే

ABN , First Publish Date - 2020-10-21T08:30:47+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు జరిగాయని ..

ఉల్లంఘనే

‘కాళేశ్వరం’లో నిబంధనలు అతిక్రమించారు

పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు 

ముందస్తు అనుమతుల్లేకుండానే నిర్మాణం

పర్యావరణానికి హాని జరిగింది

తాగునీటి ప్రాజెక్టు అనే తెలంగాణ

వాదనను అంగీకరించం 

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పు

జరిగినదానికి ఇప్పుడేమీ చేయలేం

పునరుద్ధరణ, ఉపశమన చర్యలే మార్గం

అధ్యయనానికి ఏడుగురు సభ్యుల కమిటీ

నెల రోజుల్లోగా ఏర్పాటు చేయాలి

కమిటీ ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలి

మూడో టీఎంసీ విస్తరణ పనుల్లో 

కేంద్రం ఆదేశాలను పాటించాల్సిందే

తుది తీర్పులో స్పష్టం చేసిన ఎన్జీటీ


కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే. రోజుకు రెండు టీఎంసీల బదులుగా మూడు టీఎంసీల నీటిని తోడుకోవడానికి చేపడుతున్న ఈ విస్తరణలో ఎలాంటి మౌలిక మార్పులు లేవు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన ఆమోదయోగ్యం కాదు. ఎక్కువ నీళ్లు తోడుకున్నప్పుడు సహజంగానే ఎక్కువ నిల్వ సామర్థ్యం అవసరమవుతుంది. ఇది గోదావరి నదిపై కూడా ప్రభావం చూపుతుంది. 

- జాతీయ హరిత ట్రైబ్యునల్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడంలో నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపట్టినందుకు పర్యావరణానికి హాని జరిగిందని తేల్చింది. ‘‘అక్రమాలు జరిగాయని గుర్తించినప్పటికీ జరిగినదాన్ని వెనక్కి తిప్పడం సాధ్యం కాదు. అలా చేయాలని కూడా అనుకోవడం లేదు. కానీ, జవాబుదారీతనాన్ని ఖరారు చేయాలి. తగిన పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఏ రకమైన రక్షణ చర్యలు తీసుకోవాలి? చట్టాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా జవాబుదారీ చేయాలి? అన్న అంశాలను పరిశీలించాలి.


ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు అవసరం లేని ఒక కంపోనెంట్‌ ఉన్నందుకు పర్యావరణ ప్రభావ మదింపు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లడం సరికాదు. ముందస్తుగా కాకుండా తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకోవడంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తయింది కాబట్టి కేవలం పునరుద్ధరణ చర్యలు, భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఇక్కడ ప్రధాన అంశం’’ అని ఎన్జీటీ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్రమంగా పర్యావరణ అనుమతులు తీసుకున్నారంటూ హయాతుద్దీన్‌, మూడో టీఎంసీ విస్తరణ పనులకు అనుమతులు లేవంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ఎన్జీటీ విచారించింది.


ఈ పిటిషన్లను కలిపి విచారించిన ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యుడు జస్టిస్‌ ఎస్పీ వాంగ్డీ, సభ్య నిపుణుడు నాగిన్‌ నందాల త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ప్రాజెక్టు ముందస్తు పర్యావరణ అనుమతుల్లో జరిగిన ఉల్లంఘనలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చేపట్టాల్సిన పునరుద్ధరణ, ఉపశమన చర్యలను అధ్యయనం చేయడానికి ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం సాగించిన 2008-17 మధ్య కాలంలో జరిగిన హానిని అంచనా వేయడం, అవసరమైన పునరుద్ధరణ చర్యలను గుర్తించడం, అవలంబించిన పునరావాస పద్ధతులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన పద్ధతులు వంటి అంశాలను కమిటీ అధ్యయనం చేయాలని సూచించింది. ప్రాజెక్టులో మార్పులను పరిశీలించకుండానే కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక సమర్థంగా అమలయ్యే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీకి స్పష్టం చేసింది. నెల రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ ఆరు నెలల్లో అధ్యయనాన్ని పూర్తి చేయాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 


మూడో టీఎంసీపై.. 

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని ఎన్జీటీ స్పష్టం చేసింది. రోజుకు రెండు టీఎంసీల బదులుగా మూడు టీఎంసీల నీటిని తోడుకోవడానికి చేపడుతున్న ఈ విస్తరణ లో ఎలాంటి మౌలిక మార్పులు లేవు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. ఎక్కువ నీళ్లు తోడుకున్నప్పుడు సహజంగానే ఎక్కువ నిల్వ సామర్థ్యం అవసరమవుతుందని, ఇది గోదావరి నదిపై కూడా ప్రభావం చూపుతుందని ఎన్జీటీ అభిప్రాయపడింది. విస్తరణ చేపట్టకముందే చట్టబద్ధమైన నిపుణుల కమిటీలు అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. గోదావరి నదీ యాజమన్య బోర్డుకు డీపీఆర్‌లు అందించకుం డా, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ముందుకెళ్లవద్దని సీఎంకు కేంద్ర మంత్రి లేఖ రాశారని.. తమ కు ప్రతిపాదనలు అందలేదని కేంద్ర జల సంఘం కూడా స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది.


ఈ నెల 2న సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను కేంద్ర జలశక్తి శాఖ పరిశీలించాలని, ఆ శాఖ నిర్ణయం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని సూ చించింది. కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని తేల్చి చెప్పింది. ప్రజాప్రయోజనాల కోసం వ్యవసాయ ఉత్పాదకత పెంచడంలో భాగంగా సాగునీటి వ్యవస్థను మెరుగుర్చడం, అవసరమైన ప్రజలకు తాగునీరు అందించడం కోసం ప్రాజెక్టు చేపట్టారన్నదానిలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. అయితే, అభివృద్ధి పేరిట పర్యావరణానికి హాని కలగడాన్ని విస్మరించలేమని స్పష్టం చేసింది. ‘‘చట్టపరంగా ముందస్తుగా అవసరమైన పర్యావరణ అనుమతులు తర్వాత మంజూరయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఏ చేయాలన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నను పిటిషనర్లకు సంధించినప్పుడు ఈ పరిస్థితుల్లో పునరుద్ధరణ చర్యలు అవసరమని తెలిపారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


తాగునీటి ప్రాజెక్టు కానే కాదు.. 

కాళేశ్వరం తాగునీటి ప్రాజెక్టుగా ఎప్పుడూ లేదని ఎన్జీటీ తేల్చిచెప్పింది. ప్రాథమికంగా తాగునీటి సరఫరా, జల నిర్వహణ ప్రాజెక్టు కాబట్టి 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల అవసరం రాలేదన్న తెలంగాణ వాదనను అంగీకరించలేకపోతున్నామని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తాగునీటి కంపోనెంట్‌ నిర్మాణాలే చేపట్టామని, సాగునీటి కంపోనెంట్‌ పనులు చేపట్టలేదని ప్రభుత్వం చెబుతున్నదాన్ని కూడా అంగీకరించబోమని తెలిపింది. 2008లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని, పర్యావరణ అనుమతులు పొందడానికి ముందే అధిక భాగం నిర్మాణం జరిగిందని ధర్మాసనం గుర్తు చేసింది. అనుమతులు వచ్చే ముందు సాగునీటికి సంబంధం లేని పనులే చేపట్టామంటున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యం కాదని తెలిపింది. పర్యావరణ అనుమతులు పొందే ముందు బ్యారేజీల నిర్మాణం, ఇతర కార్యకలాపాలు జరిగాయని, ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టులో భాగమేనని స్పష్టమవుతోందని తేల్చిచెప్పింది. తాగునీటి సరఫరా కోసమే చేపట్టినట్లు  ప్రభుత్వ ఆధారాలు చూపించలేకపోయిందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ ఈ అంశం పరిశీలించలేదని తెలిపింది. ప్రభుత్వం అఫిడవిట్‌లోనూ బహుళార్థ సాధక ప్రాజెక్టు అనే పేర్కొందని గుర్తు చేసింది. తాగునీటి సరఫరా ఉన్నప్పటికీ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టేనని బెంచ్‌ తెలిపింది. ముందస్తు అనుమతులు లేకుండా అటవీ భూములు మళ్లించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టు కోసం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ తమతో పాటు హైకోర్టు కూడా గుర్తించిందని తెలిపింది. ఉత్తర్వులు జారీ చేశామని.. అనుమతుల జారీ సమయంలో లేదా అఫిడవిట్‌లో కేంద్ర పర్యావరణ శాఖ దీన్ని ప్రస్తావించలేదని తప్పుపట్టింది. 

Updated Date - 2020-10-21T08:30:47+05:30 IST