కల్తీ కల్లు కేసులో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2021-01-17T05:44:02+05:30 IST
కల్తీ కల్లు కేసులో ఇద్దరి అరెస్టు
- మిగతా 10 మంది ఆచూకీ కోసం గాలింపు
వికారాబాద్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపి వందలాది మంది అస్వస్థతకు గురవడానికి కారణంగా భావిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న కల్లు డిపో నుంచి వికారాబాద్, నవాబుపేట మండలాలకు చెందిన 11గ్రామాలకు సరఫరా చేసిన ్జ్జ కల్తీ కల్లు తాగి 368 మంది అస్వస్థతకు గురి కావడమే కాకుండా మరో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కలకలం రేపిన ఈ సంఘటనలో ఎక్సైజ్ పోలీసులు చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ సమీపంలోని కల్లు డిపోతో పాటు 11కల్లు దుకాణాలను సీజ్ చేసి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ఆ కల్లులో నిషేధిత మత్తు పదార్థాలైన ఆల్ర్ఫాజోలం, డైజోఫామ్ ఉన్నట్లు తేలింది. కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని హరించే చర్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందడమే కాకుండా వందలాది మంది అస్వస్థతకు గురైన సంఘటనకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు 12మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో రమేష్గౌడ్, మనోహర్గౌడ్లను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా 10మంది ఆచూకీ తెలుసుకునేందుకు మూడు బృందాలతో ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు.