మార్చి 2నుంచి కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-21T05:38:18+05:30 IST

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేది వరకు బ్రహోత్సవాలు జరగనున్నాయి.

మార్చి 2నుంచి కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు

ఆంధ్రజ్యోతి, తిరుపతి/ చంద్రగిరి, జనవరి 20: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేది వరకు బ్రహోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేస్తున్న సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ బ్రహ్మోత్సవాలకు మార్చి 1న అంకురార్పణ, 2న ధ్వజారోహణం, 6న గరుడ వాహనం, 7న వసంతోత్సవం, 10వ తేదిన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయన్నారు. వాహన సేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఎస్వీబీసీలో ప్రొమో ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో ఆయన చర్చించారు. సీఈ రమేష్‌రెడ్డి, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శాంతి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సునీల్‌కుమార్‌, ఎస్టేట్‌ అధికారి మల్లికార్జున, రవాణా జీఎం శేషారెడ్డి, వీజీవో మనోహర్‌, ఏఈవో ధనంజయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:38:18+05:30 IST