ముక్కంటి కల్యాణ వైభోగం
ABN , First Publish Date - 2021-04-14T05:04:58+05:30 IST
నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయంలో ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరుడి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
ప్లవలో కరోనాకు కాలం చెల్లు
కోట కృష్ణమూర్తి పంచాంగ శ్రవణం
నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్ 13 : నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయంలో ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరుడి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, కలిశ పూజలు, హోమం జరిగాయి. అమ్మవారి ఆలయాన్ని పండ్లు, పూలు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రముఖ జ్యోతిష పండితుడు కోట కృష్ణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి ప్లవ నామ సంవత్సరంలో కాలం చెల్లుతుందని చెప్పారు. ఈ సంవత్సరానికి శ్రీమహావిష్ణువు అధిపతి అయినందున ప్రజలందరూ శ్రీవారి అనుగ్రహం కోసం ఏడాది పొడవునా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభకరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతుందని, ఫలితంగా రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశం ఉందన్నారు. అలాగే దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ఈ ఉత్సవాలను ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లురెడ్డి, ఈవో వేణుగోపాల్, ధర్మకర్తలు పర్యవేక్షించారు.