కమల్‌కు కాంగ్రెస్‌ ఆహ్వానం.. డీఎంకే షాక్..

ABN , First Publish Date - 2020-10-20T15:31:40+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలోని పార్టీలు ఇతర కూటముల్లోకి వెళ్లడం సర్వసాధారణమైన విషయమేనని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ చేసిన ప్రకటన నిజమయ్యేలా వుంది. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ హఠాత్తుగా సెక్యులర్‌ కూటమిలో చేరాలంటూ మక్కల్‌

కమల్‌కు కాంగ్రెస్‌ ఆహ్వానం.. డీఎంకే షాక్..

చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలోని పార్టీలు ఇతర కూటముల్లోకి వెళ్లడం సర్వసాధారణమైన విషయమేనని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ చేసిన ప్రకటన నిజమయ్యేలా వుంది. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ హఠాత్తుగా సెక్యులర్‌ కూటమిలో చేరాలంటూ మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ను ఆహ్వానించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన పార్టీ కార్య నిర్వాహక కమిటీ సమావేశంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో అసెంబ్లీ ఎన్నికల్లోగా తృతీయ కూటమి ఏర్పాటు చేయనున్నటు ప్రకటించారు. ఒకవేళ తృతీయ కూటమి సాధ్యం కాకపోతే మక్కల్‌ నీదిమయ్యం డీఎంకే కూటమిలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై వ్యాఖ్యానించమంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరిని ఓ తమిళ టీవీ చానెల్‌ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు... తమ పార్టీ నాయకత్వంలోని సెక్యూలర్‌ కూటమిలో కమల్‌ చేరితే మంచిదని ప్రకటించారు.


కమల్‌ సెక్యులరిస్ట్‌...

ఇప్పటివరకూ కమల్‌ రాజకీయ ధోరణనిని నిశితంగా పరిశీలించినప్పుడు ఆయనలో సెక్యులర్‌ భావాలే అధికంగా కనిపిస్తున్నాయని అళగిరి అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకత్వం లోని సెక్యూలర్‌ కూటమి ఘనవిజయం సాధించిందని, కనుక కమల్‌ను సెక్యులర్‌ కూటమిలో చేరమంటూ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతతత్వం అధికమైందని, ఈ తరుణంలో మతసామరస్యానికి తోడ్పడే సెక్యులర్‌ కూటమికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కమల్‌కు సూచించారు. అళగిరి చేసిన ఈ ప్రకటన డీఎంకే నాయకులకు తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. రాష్ట్రంలో సెక్యులర్‌ కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకేతో సంప్రదించకుండా అళగిరి మక్కల్‌ నీదిమయ్యం నేత కమల్‌ను ఆహ్వానించడం విరుద్ధమేనని ఆరోపించారు. అళగిరి ప్రకటన వల్ల డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్‌ వైదొలగుతుందనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కమల్‌తో కాంగ్రెస్‌ పార్టీ సన్నిహితంగా వ్యవహరించడం తప్పుకాదని, అయితే కూటమికి సంబంధించిన నిర్ణయాలను అళగిరి ప్రకటించడం గర్హనీయమన్నారు.


కూటమి నిర్ణయం కాదు...

ఇదిలా ఉండగా అళగిరి సెక్యులర్‌ కూటమిలోకి రమ్మని కమల్‌హాసన్‌ను ఆహ్వానించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయ పార్టీకి చెందిన అళగిరి సెక్యులర్‌ కూటమిని బలపరచాలనే ఉద్దేశంతోనే కమల్‌ను ఆహ్వానించారని, అళగిరి ప్రకటన డీఎంకే కూటమి ధర్మానికి విరుద్ధంగా కాదని చెప్పారు. కమల్‌ను కూటమిలోకి రమ్మని అళగిరి ఆహ్వానించినా చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత డీఎంకే అధిష్ఠానానికే ఉందని కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకొచ్చారు. అళగిరి చేసిన ప్రకటన ఆయన సొంత అభిప్రాయమే తప్ప కూటమి తరఫున కమల్‌ను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ అళగిరి చేసిన ప్రకటన ప్రస్తుతం డీఎంకే కూటమిలో తీవ్ర దుమారాన్నే రేపింది.

Updated Date - 2020-10-20T15:31:40+05:30 IST