కమనీయం.. తెప్పోత్సవం

ABN , First Publish Date - 2021-10-27T04:34:37+05:30 IST

మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ పైడిమాంబ తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం తరువాత వచ్చే మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీనిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా పెద్దచెరువులో మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించారు.

కమనీయం.. తెప్పోత్సవం
అమ్మవారి తెప్పోత్సవ దృశ్యం, (ఇనసెట్‌)లో ఉత్సవ విగ్రహానికి అభిషేకం

భారీగా భక్తుల హాజరు 

హంస వాహనంపై విహరించిన పైడిమాంబ 

విజయనగరం రూరల్‌, అక్టోబరు 26: మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ పైడిమాంబ తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం తరువాత వచ్చే మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీనిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా పెద్దచెరువులో మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తొలుత రైల్వే స్టేషన్‌ వద్దనున్న వనంగుడిలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు అన్నవరం, సింహాచలం, పైడిమాంబ ఆలయ వేదపండితులతో వేదసభ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో ముస్తాబు చేశారు. అనంతరం వనంగుడి నుంచి పెద్దచెరువు వెనుక భాగాన తెప్పోత్సవం నిర్వహించే ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. దారి పొడవునా వందలాదిగా భక్తులు పైడిమాంబ వెంట నడిచారు. జై పైడిమాంబ అంటూ హోరెత్తించారు. తర్వాత పెద్దచెరువులో పైడిమాంబ హంస వాహనంలో విహరించారు. ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అర్చకులు, సిబ్బంది పెద్దచెరువులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అధిరోహింపజేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పెద్దచెరువుకు తరలివచ్చారు. తెప్పోత్సవం విద్యుత్‌ దీపాల వెలుగులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరినీ ఆకట్టుకుంది. ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ వీవీ లక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, జేసీ కిషోర్‌కుమార్‌, మత్స్యశాఖాధికారులు నిర్మలాకుమారి, నాగమణితో పాటు పైడిమాంబ ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-10-27T04:34:37+05:30 IST