కామేపల్లి జూనియర్ కళాశాల మూసివేతకు రంగం సిద్ధం
ABN , First Publish Date - 2020-06-05T10:18:35+05:30 IST
జరుగుమల్లి మండలం కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మూసివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. జిల్లాలోని మరికొన్ని ..
ఒకేషనల్ కోర్సులకు గండం
ఒంగోలువిద్య, జూన్ 4 : జరుగుమల్లి మండలం కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మూసివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. జిల్లాలోని మరికొన్ని కళాశాలల్లో ఒకేషనల్ కోర్సుల్లో కూడా మూసివేత గండం పొంచివుంది. కామేపల్లి గ్రామానికి చెందిన గంటా శ్రీనివాసరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసినపుడు 2018లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేశారు. అయితే కళాశాలకు ప్రిన్సిపల్, అధ్యాపకుల పోస్టులు మంజూరు కాలేదు. దీంతో 2018లో ఎంపీసీ గ్రూపులో మాత్రమే 18 మంది విద్యార్థులు చేరారు. వీరికి ఇతర కళాశాలల నుంచి అధ్యాపకులు వారంలో మూడు రోజులు వచ్చి బోధించేవారు. 2019లో ఒక్క విద్యార్థి కూడా కళాశాలలో చేరలేదు. గత ఏడాది 9 మంది విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్ళపోగా, మిగిలిసిన 9 మంది ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. కామేపల్లి కళాశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి కూడా లేక పోవడంతో నిబంధనలు ప్రకారం దానిని మూసివేయడం ఖాయమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
సైన్సు కోర్సులకు సిఫార్సు
జిల్లాలోని మరికొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. యద్దనపూడి, పెద్దచెర్లోపల్లి, మార్టూరు, దొనకొండ, బల్లికురవ, పెద్దారవీడు, పొన్నలూరు, టంగుటూరు, అర్ధవీడు, కంభం తదితర కళాశాలల్లో విద్యార్థులు పెద్దగా లేదు. కేవలం ఆర్ట్స్ గ్రూపులు ఉన్న కళాశాలల్లో సైన్సు గ్రూపులు ఏర్పాటుకు కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకపోతే మూసివేత ముప్పుగురయ్యే ప్రమాదం ఉంది. కొన్ని ఒకేషనల్ కోర్సుల్లో కనీస సంఖ్యలో విద్యార్థులు లేకపోవడంతో ఆయా కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులకు ముప్పుతప్పేలా లేదు. ఆయా గ్రూపులకు సంబంధించి నిర్ణీత సంఖ్యలో విద్యార్థులు లేక పోవడంతో ఆ గ్రూపులు కొనసాగించాల లేక ఇతర కళాశాలలకు తరలించాలా లేదా మూసివేయాలా అన్న విషయంలో జిల్లా స్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చయనుంది.