8న కాదు.. 18న.. మెగా ప్రాజెక్టుల ప్రారంభం మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2020-09-05T15:35:54+05:30 IST
మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. కనకదుర్గా, బెంజ్సర్కిల్ ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలన్నింటినీ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. కనకదుర్గా, బెంజ్సర్కిల్ ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలన్నింటినీ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవం 8న జరుగుతుందని రాష్ట్ర మంత్రి శంకరనారాయణ గురువారం ప్రకటించారు. అయితే కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రారంభోత్సవాలన్నింటినీ 18న నిర్వహించనున్నట్టు శుక్రవారం సమాచారం అందింది.
అదే రోజు దాదాపు అరడజనుకు పైగా మెగా ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఆ రోజు దుర్గా, బెంజ్సర్కిల్ ఫ్లై ఓవర్లతో పాటు విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల రోడ్డు ప్రాజెక్టును, ఇబ్రహీంపట్నం-చత్తీస్ఘడ్ హైవేని ప్రారంభించనున్నారు. విజయవాడ బైపాస్, కృష్ణానదిపై ఆరు వరసల బ్రిడ్జి, బెంజ్సర్కిల్ రెండవ వరుస ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.