ఉద్యోగ సంఘాల నేతలను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2021-01-26T06:03:47+05:30 IST
సంబంధం లేని విషయంలో తలదూర్చి అభాసుపాలైన ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కనపర్తి శ్రీనివాసరావు
గుంటూరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సంబంధం లేని విషయంలో తలదూర్చి అభాసుపాలైన ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు చెప్పినా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఘీంకరించిన సంఘాల నాయకులను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించకూడదన్నారు. విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకుల తీరుపై ఉద్యోగులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంకట్రామిరెడ్డి భార్య గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన విషయం అందరికి తెలుసునన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు సుప్రీంకోర్టు తీర్పుతోనైనా తమ వైఖరి మార్చుకోవాలని కనపర్తి హితవు పలికారు.