కన్నియాకుమారిలో మళ్లీ వెనక్కి మళ్లిన సముద్రం
ABN , First Publish Date - 2022-06-03T13:18:34+05:30 IST
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో ఐదోరోజు కూడా సముద్రం వెనక్కి మళ్ళింది. దీంతో తీరం వెంబడి వందడుగుల వరకూ సముద్రం వెనక్కి
చెన్నై, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారిలో ఐదోరోజు కూడా సముద్రం వెనక్కి మళ్ళింది. దీంతో తీరం వెంబడి వందడుగుల వరకూ సముద్రం వెనక్కి మళ్ళటంతో పర్యాటకులు దిగ్ర్భాంతి చెందారు. కన్నియాకుమారిలో ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని తిలకించేందుకు వివేకానంద స్మారక మండపం, తిరువళ్ళువర్ విగ్రహ ప్రాంతాన్ని సందర్శించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గత నాలుగు రోజులుగా సముద్రం వెనక్కి మళ్ళుతుండటంతో వివేకానంద స్మారక మండపానికి, తిరువళ్లువర్ విగ్రహ ప్రాంతానికి బోట్ సఫారీని ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో బోట్ సఫారీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నాలుగు రోజులుగా ఉదయం సముద్రం వెనక్కి మళ్ళుతుండటంతో బోట్సఫారీని ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నారు. ఆ సమయంలో ఎండ అధికంగా ఉండటంతో పర్యాటకులు పడవలపై వెళ్లేందుకు జంకుతున్నారు. ఇదే విధంగా గురువారం ఉదయం కూడా సముద్రం సుమారు వందడుగుల వరకు వెనక్కి మళ్ళింది. తీరంలోని బండరాళ్లు, నాచు బయటపడ్డాయి. ఉదయం 11 గంటలకు సముద్రం మళ్ళీ యథాస్థితికి రావటంతో బోట్సఫారీని ప్రారంభించారు.