ప్రభుత్వాలు సహకరిస్తే తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తా..
ABN , First Publish Date - 2020-09-21T08:41:31+05:30 IST
మారుమూల ప్రాంతం నుంచి దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదిగానంటే అమ్మ ప్రోద్భలమే కారణ మని సిడ్నీ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి తెలిపింది.
కరణం మల్లీశ్వరి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మారుమూల ప్రాంతం నుంచి దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదిగానంటే అమ్మ ప్రోద్భలమే కారణ మని సిడ్నీ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి తెలిపింది. ఈ మాజీ వెయిట్ లిఫ్టర్ ఒలింపిక్ పతకం సాధించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మల్లీశ్వరితో టీస్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్రావు ఆదివారం వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాల్లో కొందరు ప్రతిభావంతుల్ని గుర్తించా.
అయితే, వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా శిక్షణ ఇచ్చే కోచ్లు, అకాడమీలు లేవు. కరణం మల్లీశ్వరి ఫౌండేషన్ ద్వారా ప్రస్తుతం నేను 40 మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నా. ఈ సంఖ్యను వచ్చే ఆర్నెల్లలో 300కు పెంచబోతున్నా. ఉత్తరాంధ్ర, గుంటూరు, ఒంగోలు, గ్రామీణ తెలంగాణలోని పిల్లలకు పతకాలు సాధించే సత్తా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొస్తే అక్కడి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని మల్లీశ్వరి చెప్పింది. దీనికి ఈ సమావేశంలో పాల్గొన్న శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి స్పందించి మల్లీశ్వరిని హైదరాబాద్కు ఆహ్వానించారు.