యాక్సిడెంట్ వల్లే నపుంసకుడినయ్యా.. న్యాయం చేయండంటూ యువకుడి ఆవేదన.. హైకోర్టు తీర్పేంటంటే..

ABN , First Publish Date - 2022-01-27T22:52:10+05:30 IST

అతను రోడ్డుపై వాకింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు.. ఆ సమయంలో ఒక ట్రక్కు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది..

యాక్సిడెంట్ వల్లే నపుంసకుడినయ్యా.. న్యాయం చేయండంటూ యువకుడి ఆవేదన.. హైకోర్టు తీర్పేంటంటే..

అతను రోడ్డుపై వాకింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు.. ఆ సమయంలో ఒక ట్రక్కు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.. ఆ ప్రమాదంలో అతని జననాంగానికి తీవ్ర గాయమైంది.. జననాంగాన్ని తొలిగించాల్సి వచ్చింది.. నష్టపరిహారంగా అతనికి రూ.50 వేలు మాత్రమే లభించింది.. దీంతో అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కేసులో హైకోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది.. బాధితుడికి రూ.17.66 లక్షల నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 


కర్ణాటకలోని హవేరి జిల్లా రణిబెన్నూర్ టౌన్‌కు చెందిన బసవరాజు అనే వ్యక్తి 2011లో రోడ్డుపై నడుస్తుండగా ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అతను తన జననాంగాన్ని కోల్పోయాడు. ఆ కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యూనల్ బాధితుడికి రూ.50 వేలు మాత్రమే నష్టపరిహారంగా నిర్ణయించి మొత్తం 3.73 లక్షలు చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. ఆ తీర్పుపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ యాక్సిడెంట్ వల్ల తాను నపుంసకుడినయ్యానని, తనకు తగిన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ వేశాడు. 


ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పును వెలువరించింది. `ఆ యాక్సిడెంట్ వల్ల బాధితుడికి తీరని నష్టం వాటిల్లింది. వివాహానికి కూడా దూరం కావాల్సి వచ్చింది. అతడికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అతడికి నష్టపరిహారంగా రూ.10 లక్షలతో కలుపుకుని ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం రూ.17.66 లక్షలు చెల్లించాల`ని తీర్పునిచ్చింది. 

Updated Date - 2022-01-27T22:52:10+05:30 IST