మే 31 తర్వాత షాపింగ్ మాల్స్, హోటల్స్, థియేటర్లు తెరిచేందుకు కర్ణాటక రెడీ..!
ABN , First Publish Date - 2020-05-28T21:16:22+05:30 IST
కరోనా కట్టడికి కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్డౌన్ ముగియనుంది. ఒకవేళ.. తర్వాత కూడా...
బెంగళూరు: కరోనా కట్టడికి కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్డౌన్ ముగియనుంది. ఒకవేళ.. తర్వాత కూడా లాక్డౌన్ అమలు చేసినప్పటికీ కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వ్యాపార కార్యకలాపాలు మే 31 తర్వాత యధావిధిగా కొనసాగేందుకు అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే.. మే 31 తర్వాత కర్ణాటకలో షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు తెరిచేందుకు యడియూరప్ప ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే యోచనలో ఉంది.
జూన్ 1 నుంచి హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్ తెరిచేందుకు అనుమతివ్వాలని ఇప్పటికే కర్ణాటక సీఎం యడియూరప్ప కేంద్రానికి లేఖ రాశారు. సమాధానం సానుకూలంగా వస్తుందని యడియూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. మే 31న ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ఈ విషయంపై స్పష్టత రానుంది.