కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరుస్తున్నాం: అమిత్షా
ABN , First Publish Date - 2021-11-16T22:16:31+05:30 IST
కర్తార్పూర్ కారిడార్ను ఈనెల 17వ తేదీ నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా..
న్యూఢిల్లీ: కర్తార్పూర్ కారిడార్ను ఈనెల 17వ తేదీ నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారంనాడు ఓ ట్వీట్లో తెలిపారు. కర్తార్పూర్ గురుద్వారా యాత్రను కోవిడ్ కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ''కర్తార్పూర్ గురుద్వారా దర్శించాలనుకునే సిక్కు యాత్రికులందరికీ ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. ఈనెల 17 నుంచి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తెరుస్తున్నాం. గురునానక్ దేవ్ పట్ల, సిక్కు కమ్యూనిటీ పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న ఆరాధనాభావాన్ని ఈ నిర్ణయం చాటుతోందని అమిత్షా ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
పంజాబ్ బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని గత ఆదివారంనాడు కలుసుకుని గురుపూరబ్కు ముందే కర్తార్పూర్ కారిడార్ను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతుండటం, కర్తాక్పూర్ సాహిబ్ కారిడార్ను తెరవాలంటూ కాంగ్రెస్, అకాలీదళ్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.