13వ నంబరుకు కాశీ విశ్వనాథ్ కారిడార్ గల అవినాభావ సంబంధం ఏమిటో తెలుసా?
ABN , First Publish Date - 2021-12-28T15:55:29+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ధామ్..
ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ధామ్ (కాశీ విశ్వనాథ్ కారిడార్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి '13' వ నంబరుకు లోతైన సంబంధం ఉంది. ఈ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 13న ప్రారంభించారు. ఈ సంఖ్యకు.. ఆలయ నిర్మాణ దశలతో ప్రత్యేక సంబంధం ఉంది. తలుపులు తయారు చేయడం మొదలుకొని.. వాటి అసెంబ్లింగ్ వరకూ 13 వ నంబర్ చుట్టూనే తిరిగింది.
విశ్వనాథ్ ధామ్ ప్రధాన ప్రాంగణంలో నాలుగు తలుపులు ఏర్పాటు చేశారు. వీటి మొత్తం బరువు 13 టన్నులు. వారణాసికి 1300 కిలో మీటర్ల దూరంలో రాజస్థాన్లోని జలోర్లోని రామ్సిన్ గ్రామంలో ఈ తలుపులను తయారు చేశారు. ఈ నాలుగు తలుపులు 13-13 విభాగాలుగా తయారు చేశారు. జలోర్ నుంచి బనారస్కు ఈ తలుపులను తీసుకొచ్చేందుకు 13 ట్రక్కులను వినియోగించారు. ఈ తలుపులను రాజస్థానీ కళాకారుడు కాలూరామ్ సుతార్ పర్యవేక్షణలో రూపొందించారు. 23 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఈ తలుపులను రూపొందించారు. వీటిని తయారు చేసేందుకు 13 మంది పురుషులు, 13 మంది మహిళలు శ్రమించారు. మొత్తం 1350 గంటల్లో తలుపులను సిద్ధం చేశారు. కలప, ఇత్తడితో తయారైన ఈ తలుపుల మొత్తం బరువు 13 టన్నులని ఆలయ అధికారులు తెలిపారు. జలోర్లో తయారైన ఈ తలుపులు నవంబర్ 13న వారణాసికి చేరుకున్నాయి. 13 మంది నిపుణులైన హస్తకళాకారుల బృందం ఈ తలుపులకు రూపకల్పన చేసింది. తలుపులలో ఒకటి గంగానది వైపు వెళ్లేందుకు దారితీసే ఆలయ చౌక్లో ఏర్పాటు చేశారు. మిగిలిన తలుపులను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి.