జనసంద్రంగా Kashimedu Market
ABN , First Publish Date - 2021-10-25T15:05:14+05:30 IST
స్థానిక రాయపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్లో పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం చేపల విక్రయం ఊపందుకుంది. కొనుగోలుదారులు, వ్యాపారులతో ఈ ప్రాంతం ఆదివారం
జోరుగా చేపల విక్రయం
చెన్నై/ప్యారీస్: స్థానిక రాయపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్లో పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం చేపల విక్రయం ఊపందుకుంది. కొనుగోలుదారులు, వ్యాపారులతో ఈ ప్రాంతం ఆదివారం జనసంద్రంగా కనిపించింది. పెరటాసి మాసంలో ఉపవాసం చేపట్టిన భక్తులు మాంసాహారానికి దూరంగా వుండడంతో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు తదితరాల విక్రయాలు మందకొడిగా సాగాయి. ఈనెల 17వ తేదీతో పెరటాసి ముగియడంతో మాంసాహారులు తమకిష్టమైన మటన్, చికెన్, చేపలు తదితరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలుదారుల రద్దీని ఆసరాగా చేసుకొని వ్యాపారులు కూడా ధరలు పెంచారు. ఈ నేపథ్యంలో, కాశిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి మరపడవలు, నాటు పడవల ద్వారా వెళ్లిన మత్స్యకారులు తమ వలల్లో చిక్కుకున్న మత్స్య సంపదతో తీరానికి తిరిగొచ్చి, నాణ్యత, సైజును బట్టి వేలం వేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. డీజిల్ ధరలు పెరిగినందు వల్ల మరబోటు పడవల్లో చేపల వేటకు వెళ్లే వారు తమ వలల్లో చిక్కుకున్న వంజరం, కొడువ, శంకర తదితర రకాల చేపలను కిలో రూ.600 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రప్రభుత్వం విధించిన ఆంక్షలు సడలించిన కారణంగా నగరంలో మళ్లీ చేపల మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంది.