సరిహద్దుల్లో కేసీఆర్‌ సభ!

ABN , First Publish Date - 2021-10-23T08:09:51+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించి ‘కోడ్‌’ ఉల్లంఘనకు ఆస్కారం లేకుండా సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను తీవ్రంగా పరిశీలిస్తోంది.

సరిహద్దుల్లో కేసీఆర్‌ సభ!

  • కోడ్‌ ఉల్లంఘన కాకుండా నిర్వహించే యోచన
  • కొత్తగా పరిశీలనలో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలు


హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించి ‘కోడ్‌’ ఉల్లంఘనకు ఆస్కారం లేకుండా సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈసీ తాజాగా ఎన్నికల కోడ్‌ పరిమితిని హూజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాలకూ విస్తరించింది. దీంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అనివార్యంగా హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చే పెంచికలపేట సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సభ కోసం పార్టీ అధిష్ఠానం ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తోంది. ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రానటువంటి హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్భాగమైన జమ్మికుంట మండలాన్ని ఆనుకొని ఉండే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల లేదా కమలాపూర్‌ -ఇల్లందకుంట మండలాలను ఆనుకొని ఉండే భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లిలో కేసీఆర్‌ సభ నిర్వహణకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒకచోట సభ నిర్వహించాలని భావిస్తోంది. అది వీలుకానప్పుడు మాత్రమే సీఎంతో హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో రోడ్‌ షోలు చేయించాలనేది పార్టీ వ్యూహకర్తల ఆలోచన.


ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సీఎం రోడ్‌ షో చేసే విషయం ఇంకా ఖరారు కాలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. రోడ్‌ షోలు తప్పదనుకుంటే హుజూరాబాద్‌, కమలాపూర్‌ మండలాలకు కలిపి హుజూరాబాద్‌లో ఒకటి, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు కలిపి జమ్మికుంటలో మరో రోడ్‌ షో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ సభ అయినా రోడ్‌ షోలు అయినా ఈనెల 27వ తేదీనే ఉంటాయని పార్టీ ముఖ్యులు తెలిపారు.

Updated Date - 2021-10-23T08:09:51+05:30 IST