కేసీఆర్, జగన్ మధ్య ఇంత సఖ్యత ఉన్నా... రెండు రాష్ట్రాల మధ్య సమస్యలెందుకు?

ABN , First Publish Date - 2021-11-21T21:41:09+05:30 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు.

కేసీఆర్, జగన్ మధ్య ఇంత సఖ్యత ఉన్నా... రెండు రాష్ట్రాల మధ్య సమస్యలెందుకు?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక ఇందుకు వేదిక అయింది. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి మూడు ముళ్లు వేయించుకున్నారు.


ఈ వివాహంలో కేసీఆర్, జగన్ చాలా దగ్గరగా కూర్చుకుని ముచ్చటించుకున్నారు. ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదంపై అటు ఏపీ మంత్రులు, ఇటు తెలంగాణ మంత్రులు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టుపై ఏపీ అభ్యతరం చెబుతోంది. అట్లాగే ఏపీ ప్రాజెక్టులను తెలంగాణ అడ్డుకుంటోంది. జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. జల వివాదమే కాకుండా ఆర్థిక పరమైన అంశాలపై కూడా తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి, జగన్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మంత్రి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్నినాని కూడా ఘాటుగానే జవాబిచ్చారు.


అయితే గతంలో ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత ఉండేది. ఏమైందో ఏమో గాని ఒక్కసారి ఇద్దరి మధ్య మాటలు బంద్ అయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదం, ఇతర అంశాల నేపథ్యంలో సీఎంలిద్దరూ ఎదురుపడినా మాట్లాడుకోరని అందరూ అనుకున్నారు. అయితే అనుకోకుండా ఇద్దరి సీఎంలను పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం దగ్గరకు చేర్చింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నట్లు అర్థమవుతోంది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుని సమస్యలను పరిషర్కించే అవకాశం ఉన్న రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య ఆజ్యం పోస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-11-21T21:41:09+05:30 IST