తెలంగాణలో డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించాలి: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-01-28T23:15:54+05:30 IST

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి ప్రథానంగా దూసుకుపోతున్నదని సీఎం అన్నారు.నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు.  


ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని  సీఎం కేసీఆర్ అన్నారు.1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని  అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్" ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ని సీఎం కెసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతం గా పనిచేస్తున్నాయని,అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు  కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు . ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంద నీ సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు.


డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయం లో ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు  ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా  తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.


ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కవితా నాయక్,  ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్ర కుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, సాయన్న, రేఖా నాయక్, అబ్రహం, హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సీఎంవో అధికారులు నర్సింగ రావు, భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T23:15:54+05:30 IST