కేసీఆర్‌కు రాజకీయ సమాధి కడతా: తీన్మార్ మల్లన్న

ABN , First Publish Date - 2021-08-04T23:44:21+05:30 IST

వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ను వరంగల్‌లోనే రాజకీయ సమాధి కడతానని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.

కేసీఆర్‌కు రాజకీయ సమాధి కడతా: తీన్మార్ మల్లన్న

హైదరాబాద్: వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ను వరంగల్‌లోనే రాజకీయ సమాధి కడతానని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. కేసీఆర్ 400మంది పోలీసులతో తన ఆఫీసులో తనిఖీలు చేశారని, పోలీసులు తనిఖీలు చేయాల్సింది ఆయన ఫామ్‌హౌస్‌లోనని చెప్పారు. యువతితో ఫిర్యాదు విషయంలో కేసీఆర్ త్వరలోనే పూల్ కాబోతున్నాడని ఎద్దేవాచేశారు. వరంగల్‌ను తెలంగాణ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని తీన్మార్‌ మల్లన్న హెచ్చరించారు.


 తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేశారు. తీన్మార్‌ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీ‌స్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా  అక్కడి పోలీసులు సైతం 41ఏ నోటీసు అందజేశారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని, బాధితులు, సాక్షులను ప్రభావితం చేయొద్దని నోటీసులో పేర్కొన్నారు.



Updated Date - 2021-08-04T23:44:21+05:30 IST