18న వరంగల్ జిల్లాకు కేసీఆర్?
ABN , First Publish Date - 2022-01-18T00:14:15+05:30 IST
సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మంగళవారం పర్యటిస్తారని సమాచారం. ఈనెల 10 నుంచి 15 వరకు అకాల వర్షాలు
వరంగల్: సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మంగళవారం పర్యటిస్తారని సమాచారం. ఈనెల 10 నుంచి 15 వరకు అకాల వర్షాలు, ఈనెల 11న రాత్రి నుంచి 12 ఉదయం వరకు కురిసిన భారీ వడగండ్ల వాన కురిసిన విషయం తెలిసిందే. వర్ష బీభత్సంతో జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, చెన్నారావుపేట, మామునూరు, సంగెం, గీసుగొండ, నెక్కొండ తదితర మండలాల్లోని 191 గ్రామాల్లో 25వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కంది, శనగ తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షలాది రూపాయలను రైతులు నష్టపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అకాల వర్షాలతో జరిగిన నష్టంపై సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పంటలను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చేందుకు జిల్లాలో పర్యటిస్తారని చెబుతున్నారు. అయితే సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ వివరాలు అధికారికంగా వెల్లడించాల్సింది ఉంది.