కేసీఆర్ లేఖ రాసింది వాస్తవమే: కేంద్రం
ABN , First Publish Date - 2021-12-01T21:25:34+05:30 IST
రాష్ట్రంలో ధాన్యం సేకరణను మరింతగా పెంచాలని కేంద్రానికి తెలంగాణ
ఢిల్లీ: రాష్ట్రంలో ధాన్యం సేకరణను మరింతగా పెంచాలని కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాసింది వాస్తవమేనని కేంద్రం పేర్కొంది. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. మిగులు బియ్యాన్ని తీసుకోవాలంటూ రాష్ట్రాలు కోరడంతో టార్గెట్ మించి తీసుకున్నామని కేంద్రం తెలిపింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్లో 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని ఆగస్ట్ 17న రాష్ట్ర ప్రభుత్వంతో భేటీలో నిర్ణయించామన్నారు. పెరిగిన సాగును దృష్టిలో పెట్టుకుని సేకరణ మరింతగా పెంచుతామని పేర్కొంది. ఈ ఖరీఫ్ సీజన్లో పంజాబ్లో లాగానే ముందుగా నిర్ణయించిన 40 లక్షల టన్నులకు మించి 90 లక్షల టన్నులకు పెంచాలని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాసిన విషయ వాస్తవమేనని కేంద్రం తెలిపింది. రాబోయే పంటల ఉత్పత్తుల అంచనాలు, మార్కెట్ మిగులు, వేసిన పంటల లెక్కలు లేదా విస్తీర్ణం ఆధారంగా తుదుపరి సేకరణ పెంచాలా లేదా తగ్గించాలా అనేది నిర్ణయిస్తామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా 2021-22 ఖరీఫ్లో వరి ధాన్యం సేకరణ టార్గెట్ 521.89 లక్షల మెట్రిక్ టన్నులని పేర్కొంది. యాసంగి సీజన్ మొదలయ్యాక రబీ టార్గెట్ నిర్ణయిస్తామంది. 2020-21 రబీలో మొత్తం 55 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఉండగా రాష్ట్రాల నుంచి 61.87 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని కేంద్రం పేర్కొంది.