కేసీఆర్ గిరిజనులు నీకు బానిసలా?: వైఎస్ షర్మిల
ABN , First Publish Date - 2021-08-19T01:13:03+05:30 IST
‘సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా’’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఏటూరునాగారం: ‘‘సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా’’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో బుధవారం షర్మిల పోడు భూముల పోరు యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోడు భూముల సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ కోసం ఆనాడు కొమురం భీం పోరాటం చేస్తే నేడు అడవి బిడ్డలు పోడు భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ గిరిజనుల భూములను లాక్కొని వారిపై కేసులు మోపుతూ జైళ్లలో పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ దళితులకు బంధువయ్యాడని, గిరిజనులకు బంధువు కాడా? అని షర్మిల ప్రశ్నించారు.