నేను రాజీనామా చేసింది వాస్తవమే.. కానీ.. : టీడీపీ ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2021-01-19T18:52:54+05:30 IST
ట్లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.
కర్నూలు : జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. అప్పట్లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కానీ.. మీడియా ముందుకు కానీ రాలేదు. ఇవాళ కర్నూలులో మీడియా మీట్ పెట్టిన ఆయన మరోసారి తన రాజీనామా ప్రస్తావన తెచ్చారు. ‘నేను టీడీపీకి రాజీనామా చేసింది వాస్తవమే. కానీ టీడీపీ అధిష్టానం నా రాజీనామాను ఆమోదించలేదు. నా సోదరుడు కేఈ ప్రతాప్ రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు. అందుకే నేను డోన్ బాధ్యతలు స్వీకరించాను. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు డోన్, పత్తికొండ, ఆలూరు ఎక్కడ నుంచైనా పోటీ చేస్తాను. స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్ల విషయంలో కోట్ల కుటుంబానికి మాకు కొంత విభేదాలు వచ్చాయి. వాటిని టీడీపీ అధిష్టానం సర్ది చెప్పింది’ కేఈ ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
కార్యకర్తల్లో ఉత్సాహం..
2014 నుంచి టీడీపీ డోన్ ఇన్చార్జిగా కేఈ ప్రతాప్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల హైదరాబాదులో కేఈ కృష్ణమూర్తి నివాసంలో కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్ భేటీ అయినట్లు తెలిసింది. డోన్ టీడీపీ బాధ్యతలను తీసుకోవాలని కేఈ ప్రభాకర్ను కోరినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డోన్ బాధ్యతలు తీసుకోవాలని కేఈ ప్రభాకర్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు సోమవారం డోన్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో డోన్ బాధ్యతలు తీసుకుంటున్నట్లు కేఈ ప్రభాకర్ ప్రకటించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
16 ఏళ్ల తర్వాత..!
ఇదిలా ఉంటే.. డోన్ నియోజకవర్గ రాజకీయాల్లోకి మళ్లీ కేఈ ప్రభాకర్ అడుగు పెట్టారన్న మాట. 16 ఏళ్ల తర్వాత ఆయన టీడీపీ బాధ్యతలను తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వారసునిగా 1996లో కేఈ ప్రభాకర్ డోన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అప్పుడు డోన్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కేఈ ప్రభాకర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో సీఎం చంద్రబాబు క్యాబినెట్లో విద్యాశాఖ, అటవీశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1999 ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నుంచి రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో డోన్ నుంచి మరోమారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఈ ప్రభాకర్ మొదటి సారి ఓడిపోయారు. తర్వాత డోన్ నియోజకవర్గ రాజకీయాలకు దూరమయ్యారు.