'ఆప్' కన్వీనర్‌గా మూడోసారి ఎన్నికైన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-09-12T22:20:00+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఏకగ్రీవంగా..

'ఆప్' కన్వీనర్‌గా మూడోసారి ఎన్నికైన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆప్ కన్వీనర్‌గా ఆయన ఎన్నికకావడం వరుసగా ఇది మూడోసారి. ఆదివారంనాడిక్కడ జరిగిన 'ఆప్' నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయనను పార్టీ సుప్రీంగా మరోసారి ఎన్నుకున్నారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఏకగ్రీవ ఎన్నిక ఆ పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపరచే అకాశాలున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


కేజ్రీవాల్ 2016 ఏప్రిల్‌లో రెండోసారి ఆప్ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. రెండో టర్మ్‌లో మూడేళ్ల పాటు సేవలందించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేజ్రీవాల్ పదవీకాలం 2020 వరకూ పొడిగించారు. 2020లో కోవిడ్ చెలరేగడంతో పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఈ ఏడాది జనవరిలో నేషనల్ కౌన్సిల్ సమావేశమై పార్టీ రాజ్యాంగానికి సవరణలు చేసింది. పార్టీ కన్వీనర్ పదవీకాలాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచుతూ సవరణ చేశారు. 34 మంది సభ్యులతో కూడిన ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌కు పార్టీ నేషనల్ కన్వీనర్‌ను ఎన్నుకునే అధికారం ఉంటుంది. తాజాగా మరోసారి నేషనల్ కన్వీనర్‌గా ఎన్నికైన కేజ్రీవాల్ ఆ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. పార్టీ నేషనల్ సెక్రటరీ, నేషనల్ ట్రెజరర్ ఎన్నిక కూడా ఆదివారం జరిగిన సమావేశంలో జరిగింది. పంకజ్ గుప్తా తిరిగి పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నిక కాగా, జాతీయ కోశాధికారిగా ఎన్‌డీ గుప్తా మరోసారి ఎన్నికయ్యారు.

Updated Date - 2021-09-12T22:20:00+05:30 IST