మోదీకి థ్యాంక్స్ చెప్పిన కేజ్రీవాల్..

ABN , First Publish Date - 2021-05-06T22:34:55+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...

మోదీకి థ్యాంక్స్ చెప్పిన కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణవాయువు లేక అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలకు నిన్న ఆక్సిజన్ సరఫరా కావడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు. ‘‘రోజువారీగా ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగం అవుతోంది. రోజువారీ ప్రాతిపదికన ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని మేము కోరుతూ వస్తున్నాం. నిన్న తొలిసారి ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది...’’ అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. దేశ రాజధానికి ప్రతి రోజూ ఇంతే మొత్తంలో ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీ ప్రజల తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రోజువారిగా కనీసం ఇంతే మొత్తంలో అయినా ఆక్సిజన్ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికంటే ఇంకా ఏమాత్రం తగ్గించకూడదు. ఢిల్లీ మొత్తం మీకు రుణపడి ఉంటుంది..’’ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని ఆస్పత్రులతో పాటు పరిసర ప్రాంతాల ఆస్పత్రులు ఆక్సిజన్ లేక తీవ్రంగా సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 1న ఆక్సిజన్ సకాలానికి అందకపోవడంతో ఢిల్లీలో బాత్రా ఆస్పత్రిలో ఓ సీనియర్ వైద్యుడు సహా 12 మంది కొవిడ్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. కొరత కారణంగా జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది, సర్ గంగారాం ఆస్పత్రిలో 25 మంది చనిపోయిన రెండు వారాల లోపే బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక పేషెంట్లు అల్లాడిపోయారు.

Updated Date - 2021-05-06T22:34:55+05:30 IST