గోవా సీఎం అభ్యర్థి ప్రకటనకు కేజ్రీవాల్ సిద్ధం
ABN , First Publish Date - 2022-01-18T23:42:29+05:30 IST
గోవా అసెంబ్లీ ఎన్నికలను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్..
పనజి: గోవా అసెంబ్లీ ఎన్నికలను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. బుధవారంనాడు సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 14న ఒకే విడతలో గోవా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ముందుగా చెప్పినట్టే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ పేరును కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 13 పాయింట్ల ఎజెండాతో ముందుకెళ్తామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఎజెండాను అమలు చేస్తామని, నిరంతరాయ ఉచిత విద్యుత్, నీరు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య కల్పిస్తామని, అవినీతిని తరిమిగొడతామని, ఆరోగ్యం, వ్యాపార, మైనింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీలిచ్చారు. ఇప్పటి వరకూ బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరో ఛాయెస్ లేని గోవా ప్రజలు ఇప్పుడు ఆప్ వైపు ఎంతో ఆశాభావంతో చూస్తున్నారని చెప్పారు.