Kerala Catholic Diocese: ఐదుగురు పిల్లలున్న కుటుంబాలకు సంక్షేమ పథకం
ABN , First Publish Date - 2021-07-27T13:28:03+05:30 IST
క్రైస్తవుల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి కాథలిక్ చర్చ్ డియోసెస్ కొత్తగా సంక్షేమ పథకాన్ని....
క్రైస్తవ జనాభా పెంపు కోసం ప్రోత్సాహాకాలు
కొట్టాయం (కేరళ): క్రైస్తవుల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి కాథలిక్ చర్చ్ డియోసెస్ కొత్తగా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2000 వ సంవత్సరం తర్వాత వివాహం చేసుకున్న వారిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న జంటలకు నెలసరి రూ.500 నుంచి 1500రూపాయల ఆర్థికసహాయం అందించనున్నట్లు కేరళ రాష్ట్రంలోని సిరో మలబార్ చర్చి ఆధ్వర్యంలోని కాథలిక్ చర్చ్ డియోసెస్ తాజాగా ప్రకటించింది. చర్చ్ ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ వేడుకల్లో భాగంగా ఈ ప్రకటన చేశారు. కొవిడ్ అనంతరం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన జంటలకు ఆగస్టు నెల నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఫాదర్ జోసెఫ్ కుట్టియంకల్ చెప్పారు.
కేరళలో క్రైస్తవ జనాభా కొన్నేళ్లుగా తగ్గిపోతున్న నేపథ్యంలో చర్చ్ ఈ నిర్ణయం తీసుకుంది. కేరళ ఏర్పడినపుడు క్రైస్తవులు రాష్ట్రంలోనే అతిపెద్ద సమాజంగా ఉండేవారు. ప్రస్థుతం కేరళ జనాభాలో క్రైస్తవుల శాతం 18.38 గా తగ్గింది. క్రైస్తవ జనాభా పెంపును ప్రోత్సహించేందుకే ఐదుగురు పిల్లలున్న జంటలకు ప్రోత్సహాకాలు అందించాలని నిర్ణయించారు. దీంతోపాటు నాల్గవ బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు ఉచిత డెలివరీ కేర్ కూడా అందించాలని చర్చ్ నిర్ణయించింది. ఎక్కువ మంది పిల్లలున్న వారికి చర్చ్ నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకోవడానికి స్కాలర్ షిప్ లు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు చర్చ్ ఫాదర్ చెప్పారు.