జప్తుచేసిన వాహనాలపై మొక్కల పెంపకం: కేరళ పోలీసుల వినూత్న ఆలోచన

ABN , First Publish Date - 2020-09-12T00:12:23+05:30 IST

కేరళ పోలీస్ స్టేషన్లలో తుప్పుపట్టిన, వదిలేసిన వాహనాలు వందలాదిగా కనిపిస్తుంటాయి. అక్కడిది సర్వసాధారణం కూడా.

జప్తుచేసిన వాహనాలపై మొక్కల పెంపకం: కేరళ పోలీసుల వినూత్న ఆలోచన

తిరువనంతపురం: కేరళ పోలీస్ స్టేషన్లలో తుప్పుపట్టిన, వదిలేసిన వాహనాలు వందలాదిగా కనిపిస్తుంటాయి. అక్కడిది సర్వసాధారణం కూడా. పోలీసులు జప్తు చేసిన వాహనాల్లో ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు ఉంటాయి. వీటిని వేలం వేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ చట్టపరమైన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. దీంతో జప్తు చేసిన వాహనాలు ఎండకు ఎండి, వానకు తడిసి చివరికి మట్టిలో కలిసిపోతున్నాయి. 2019 నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో 40 వేలకు పైగా ఇలాంటి వాహనాలు పడి ఉన్నాయి.  


వీటిని ఏం చేయాలో తెలియని త్రిసూర్ జిల్లాలోని చెరుతుర్తి పోలీస్ స్టేషన్ అధికారులకు అద్భుతమైన ఐడియా వచ్చింది. అంతే, ఆ తర్వాత కొన్నాళ్లకు పాడైన వాహనాలన్నీ పచ్చగా కళకళలాడడం మొదలుపెట్టాయి. ఆ వాహనాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకం మొదలుపెట్టారు. రైతు కూడా అయిన సివిల్ పోలీస్ ఆఫీసర్ రంగరాజ్ మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇతర అధికారులు సింప్సన్, సుధాకరన్, బాబీ, రంజిత్, రఘు, అనిల్ వంటివారితో కలిసి వాటి బాగోగులు చూసుకుంటున్నారు. 


మట్టి, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న కొన్ని మినీ లారీలను కొన్నాళ్ల క్రితం పట్టుకున్నామని సింప్సన్ పేర్కొన్నారు. వాటిని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో వాటిలో కూరగాయలు పెంచాలని మూడు నెలల క్రితం నిర్ణయించినట్టు చెప్పారు. గతవారం విజయవంతంగా పంట దిగుబడి కూడా వచ్చిందన్నారు. వాటిని తమ పోలీస్ స్టేషన్ క్యాంటీన్‌కు అందజేసినట్టు వివరించారు.


తమ నిర్ణయం సత్ఫలితాలివ్వడంతో మిగతా వాహనాలను కూడా ఇలాగే వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో బెండకాయ, పాలకూర, పొడవు బీన్స్ పండించగా, ఇప్పుడు మరిన్ని కూరగాయలు పండించేందుకు రెడీ అవుతున్నారు. పోలీసుల వినూత్న ఆలోచనను చూసిన వారు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చెరుతర్తి పోలీసులపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2020-09-12T00:12:23+05:30 IST