Viveka Murder Case : ఏబీఎన్‌తో కీలక అనుమానితుడి స్టేట్‌మెంట్

ABN , First Publish Date - 2021-07-24T18:21:47+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది.

Viveka Murder Case : ఏబీఎన్‌తో కీలక అనుమానితుడి స్టేట్‌మెంట్

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య అలియాస్ రంగన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా కీలక అనుమానితుడిగా ఉన్న ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడి పలు కీలక విషయాలు వెల్లడించారు. వివేకానందరెడ్డి తనకు దేవుడితో సమానమని చెప్పుకొచ్చారు. తాను చీమకు కూడా హాని చేయనని తెలిపారు. కేవలం వివేకాతో తాను సన్నిహితంగా వుండటం వల్లే కేసులు పెట్టారని స్పష్టం చేశారు.


ప్రమాణానికి సిద్ధం..

నన్ను సీబీఐ విచారిస్తోంది. వాచ్‌మెన్ రంగన్నను వివేకా ఇంట్లో చూశానే తప్ప ఏ రోజూ మాట్లాడలేదు. రంగన్నను నేను బెదిరించింది అవాస్తవం. వివేకా హత్యకేసులో నా ప్రమేయం ఉందని అతను నాపై ఎలా చెబుతున్నాడో అర్ధం కావట్లేదు. వివేకా హత్యకేసులో నా ప్రమేయం ఉందంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం.. ఏ ప్రమాణానికైనా సిద్ధం. హత్య జరిగిన ముందురోజు రాత్రి ముందు వివేకాతో కలిసే ఉన్నాం. నన్ను మా ఇంటి దగ్గర దింపి ఆయన ఇంటికెళ్లారు. హత్య జరిగిందని ఉదయం 7 గంటలకు వివేకా బావమరిది నాకు కాల్ చేసి చెప్పారు. వివేకా కుమార్తె సునీత కూడా నన్ను వివరాలు అడిగారు. రాత్రి తిరిగివచ్చిన వివరాలు ఆమెకు వివరించాను అని ఏబీఎన్‌తో గంగిరెడ్డి చెప్పారు. అయితే.. రంగయ్యని ఎర్రం గంగిరెడ్డి ఎందుకు బెదిరించారు?.. సుపారీ వ్యవహారంలో ఎర్రం గంగిరెడ్డి పాత్ర ఏంటి? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.


రంగయ్య ఏం చెప్పారంటే..

వివేకా హత్య కేసులో జమ్మలమడుగు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్‌ రంగయ్య శుక్రవారం రాత్రి స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుట పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ‘‘ఆ ముగ్గురిలో ఒకరు... తమ పేర్లు బయటికి చెబితే నన్ను నరికేస్తామన్నారు. అందుకే... భయపడ్డాను. సీబీఐ సారోళ్లు మేమున్నామని ధైర్యం చెప్పడంతో ఏమైనా కానీ అని సీబీఐ సారోళ్లకు, కోర్టులో అవే చెప్పాను’’ అని రంగయ్య వివరించారు.గురువారం నన్ను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు లేదంటే మళ్లీ కడపకు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం మళ్లీ జమ్మలమడుగుకు తీసుకెళ్లి కోర్టులోకి పంపించారు. రాత్రి పెద్ద సారోళ్లు పులివెందులకు తీసుకొచ్చి జేఎన్‌టీయూ వద్ద వదిలేశారు. నా ఖర్చులకు ఏమైనా ఇవ్వండి సార్‌ అంటే ఢిల్లీ పెద్దసారు రూ.1,500 ఇచ్చారు. కాగా.. రంగయ్యను సీబీఐ అధికారులు ఒంటరిగా వదిలి వెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, భద్రత కల్పించాల్సిన అవసరముందని చర్చించుకున్నారు.

Updated Date - 2021-07-24T18:21:47+05:30 IST