ఖానా.. పీనా.. బదల్గయా
ABN , First Publish Date - 2022-01-23T05:16:28+05:30 IST
జనం అభిరుచికనుగుణంగా ఫుడ్కల్చర్ పూర్తిగా మారిపోయింది.
- నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వంద కొత్త రెస్టారెంట్లు
- అందుబాటులో రుచికరమైన అరేబియన్ వంటకాలు
- ఆలూ సబ్జిలకు పెరిగిన గిరాకీ
- కాల్చిన మాంసం, చంపారన్ మటన్ రుచులను ఆస్వాదిస్తున్న బిహార్, చత్తీస్ఘడ్ వాసులు
- ఏటా రూ.1300 కోట్ల మద్యం విక్రయాలు
- వీకెండ్స్లలో రెస్టారెంట్లకు వెళ్తున్న మధ్యతరగతి కుటుంబాలు
జనం అభిరుచికనుగుణంగా ఫుడ్కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల ఇది విస్తరించింది. స్థానిక వంటకాలతోపాటు దక్కన్, అరేబియన్ రుచులు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క నాగర్కర్నూల్ జిల్లాలోనే దాదాపు వంద రెస్టారెంట్లు కొత్తగా వెలసి లాభాలు గడిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు జార్ఖండ్, చత్తీస్ఘడ్కు చెందిన వారు అధికంగా ఉండడం, వారంతా నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో నివసిస్తుండడంతో వారి సాంప్రదాయ వంటలతో పాటు హైదరాబాద్, అరేబియాన్ ఫుడ్ను కూడా వారికి పరిచయం చేయడానికి రెస్టారెంట్ల నిర్వాహకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు కూడా గణనీయంగా పెరగడం గమనార్హం.
కేవలం జాతర్లలో మాత్రమే లభించే మటన్ సీకు లకు క్రేజ్ తగ్గలేదు. వారంలో ఏడు రోజులు కాల్చిన మాంసం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రత్యేక వంటకం కావడంతో బీహార్, చత్తీస్ఘడ్ వాసులు మటన్ సీకులకు అలవాటుపడ్డారు. జిల్లా కేం ద్రంలో దాదాపు 20మటన్, చికెన్ సీకుల కేం ద్రాలున్నాయి. మటన్ 10కేజీలు, చికెన్ 20 కేజీల వరకు అమ్ముడవుతున్నట్లు నిర్వాహ కులు తెలిపారు. దీనికి తోడు బీహార్లో ఫేమస్ అయిన చంపారన్ మటన్, కుండ బిర్యానీ కేంద్రాలు కూడా వెలిశాయి. రెస్టారెంట్ల నిర్వహణ ఒరిస్సా, పశ్చిమబెంగాల్కు చెందిన యువతులు చూ స్తుండడం గమనార్హం. గతంలో అరేబియ న్ మండి వంటకాల రుచిని ఆస్వాదించేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ కంటే ఇక్కడే చౌకగా లభిస్తుండడంతో జనం ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు కూడా వీకెండ్స్లలో కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి అరేబియన్ మండి, చంపారన్ మటన్ రుచులను ఆస్వాదిస్తున్నారు.
మందుతో మస్త్ మజా..
రెస్టారెంట్ల సంఖ్య పెంచడంతో విక్రయాలు గణనీ యంగా పెరిగాయి. తిమ్మాజిపేట ఐఎంఎల్ డిపోలో 2020-21సంవత్సరానికిగాను రూ.1300కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఉన్న కంపెనీల దగ్గర క్యాంపుల పక్కన బెల్టు షాపులు ఏర్పాటు చేసిన వాళ్లు 40 నుంచి 50వేల రూపాయలు మద్యం అమ్మకాలు జరుపుతుండడం గమనార్హం. ఇలా దాదాపు 40 బెల్టు షాపులున్నాయి. వీటి చుట్టునే చికెన్ఫ్రై, జొన్నరొట్టె కేంద్రాలు దాదాపు 60 నుంచి 70దాకా ఉండడం. అవ న్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడం విశేషం.
టీ, కాఫీ సెంటర్లకు పెరిగిన డిమాండ్
టీ, కాఫీ సెంటర్ల సంస్కృతి ఉమ్మడి జిల్లాల్లోని మం డలాల్లో కూడా విస్తరించింది. అనేక బ్రాండ్ల పేర్లతో మండల స్థాయిలో కూడా ఇవి జనాన్ని ఆకర్షిస్తున్నా యి. ముఖ్యంగా యువకులు ఈ సెంటర్లలో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో 150 నుంచి 200 దాకా ప్రారంభించారు. యువత తమకు నచ్చిన టీ, కాఫీల రుచిని ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్తో గడపడం నిత్యకృత్యంగా మారింది. వీటి నిర్వాహకులు కూడా 20 నుంచి 30 రకాల టీ, కాఫీలను అం దిస్తున్నారు.