అందుకే బీజేపీలో చేరా : ఖుష్బూ

ABN , First Publish Date - 2020-10-21T17:18:17+05:30 IST

కాంగ్రెస్‌లో కొందరు తనను అణచివేశారని మండిపడ్డ ఖుష్బూ, వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి ఇష్ట పడలేదు. అయితే.. సోనియాకు

అందుకే బీజేపీలో చేరా : ఖుష్బూ

న్యూఢిల్లీ : రాహుల్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే కాంగ్రెస్‌ను వీడినట్లు బీజేపీ నేత, నటి ఖుష్బూ ప్రకటించారు. కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో రాను రానూ అసంతృప్తి పెరిగిపోతోందని, ఈ విషయంపై రాహుల్ త్వరలోనే మేల్కొంటే మంచిదని చురకలంటించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని వ్యాఖ్యానిస్తూ... బీజేపీలో చేరడంపై సమర్థించుకున్నారు. ఫిబ్రవరిలోనే అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపామని, అయితే వ్యక్తిగతంగా మాత్రం కలవలేకపోయానని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌లో కొందరు తనను అణచివేశారని మండిపడ్డ ఖుష్బూ, వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి ఇష్ట పడలేదు. అయితే.. సోనియాకు రాసిన లేఖలో మాత్రం పూర్తి వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు.


 ‘‘ఒక్కరు కాదు... చాలా మంది అణచివేయడానికి ప్రయత్నించారు. అది రాష్ట్ర నేతలు కావొచ్చు.. జాతీయ నేతలు కావొచ్చు.. పార్టీలో అలాంటి వారున్నారు. దురదృష్టవశాత్తు... వారందరూ ఢిల్లీలో ఓ కొటరీలాగా తయారయ్యారు. ముఖ్యంగా రాహుల్... ఆయన చుట్టూ ఆ కోటరీని ఏర్పర్చుకున్నారు. కొత్తగా వచ్చే వారిని అందులోకి అనుమతించరు. వారందరూ పారదర్శకంగా ఉండరు.’’ అని ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. చాలా రోజుల క్రితమే బీజేపీ చేరాలంటూ ఆఫర్లు వచ్చాయని, అయితే అది కుదరదని బీజేపీ నేతలతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అయితే చివరికి పునరాలోచనలో పడి...  బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కొందరు తనను తీవ్రంగా అవమానించారని, అయినా వాటన్నింటినీ సహిస్తూ వచ్చానని తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీలో చేరడం ఏమాత్రం రాజకీయ ఎత్తుగడ కాదని ఖుష్బూ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-21T17:18:17+05:30 IST