బాధితులే కిడ్నాపర్లు
ABN , First Publish Date - 2020-07-12T16:55:55+05:30 IST
నిరుద్యోగులు కిడ్నాపర్ల అవతారమెత్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని..
ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి మోసపోయిన వారంతా జట్టు కట్టి.. కిడ్నాప్కు యత్నం
బెడిసికొట్టిన ప్లాన్
గాజువాకలో పట్టుకున్న పోలీసులు
కాకినాడ, ఆంధ్రజ్యోతి: నిరుద్యోగులు కిడ్నాపర్ల అవతారమెత్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశచూపి డబ్బులు తీసుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్లాన్ బెడిసికొట్టి చివరికి పోలీసులకు చిక్కారు. బాధితులే నేరస్థులుగా మారారు. విశాఖపట్నం సమీపంలోని గాజువాకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని 7 జిల్లాల పరిధిలో ఓ ఆధ్మాత్మిక ట్రస్టు విస్తరించి ఉంది. ఆ ట్రస్టు ప్రధాన కార్యాలయం కాకినాడలో ఉంది. ట్రస్టు పరిధిలో సుమారు 150 ఎయిడెడ్ విద్యా సంస్థలున్నాయి. వాటిలో పోస్టులు ఖాళీగా ఉండడంతో మూడేళ్ల క్రితం వాటి భర్తీకి ట్రస్ట్ ప్రతినిధులు ప్రయత్నించారు.
అయితే కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉండడంతో ఉద్యోగాల భర్తీకి ఆటంకం ఏర్పడింది. కానీ ఇదే అదనుగా భావించి అప్పట్లో ట్రస్ట్లో కీలక వ్యక్తిగా పనిచేసిన ఆగస్టీన్, మరో మహిళ ప్రతినిధి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ. 80 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. ఈ విషయం ట్రస్ట్ ప్రతినిధులకు తెలియడంతో డబ్బు వసూలు చేసిన ఇద్దరిని ట్రస్ట్ నుంచి బహిష్కరించారు. దీంతో వారిద్దరూ పరారయ్యారు.
డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు అగస్టీన్ ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించారు. పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఈ క్రమంలో వారిలో కొందరికి ఓ ఐడియా వచ్చింది. అగస్టీన్ను కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు లాక్కోవాలని అనుకున్నారు. అందరూ కలిసి కిడ్నాప్కు స్కెచ్ గీశారు. ఆగస్టీన్ విశాఖలో ఉన్నాడని తెలుసుకుని రెక్కీ నిర్వహించారు. శనివారం గాజువాక సమీపంలోని మింది జంక్షన్ వద్దకు రెండు కార్లలో వెళ్లి కిడ్నాప్ చేశారు. ఈలోపే పోలీసులకు సమాచారం తెలియడంతో ఆ రెండు కార్లను గాజువాక వద్ద పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.