కిడ్నాప్ అయిన వ్యక్తి హైదరాబాద్లో..
ABN , First Publish Date - 2020-12-05T05:28:20+05:30 IST
ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో చిన్నబాబు అలియాజ్ చిన్నరాజిబాబు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది.
ఆదోని రూరల్, డిసెంబరు 4: ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో చిన్నబాబు అలియాజ్ చిన్నరాజిబాబు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. అతను హైదరాబాద్లో ప్రత్యక్ష్యమయ్యాడు. గ్రామానికి చెందిన కూలీ రైతు చిన్నబాబు తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ద్విచక్ర వాహనంపై తీసుకుపోతున్నారని మామ గాబ్రియేల్కు గురువారం సాయంత్రం ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత సెల్ఫోన్ స్విచ్ఆఫ్ అయ్యింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి, తాలుకా సీఐ పార్థసారథి, టూటౌన్ సీఐ శ్రీరాములు, తాలుకా ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి చిన్నబాబు ఫోన్ కాల్ను ట్యాప్ చేసి ఆరా తీశారు. ఫోన్ లొకేషన్ ద్వారా శుక్రవారం ఉదయం హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహాయంతో ఆదోని పోలీసులు చిన్నబాబును అదుపులోకి తీసుకున్నారు. తాలుకా ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి హైదరాబాద్కు చేరుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారని ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. చిన్నబాబు ఫోన్ కాల్ లిస్టు, సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టామని తెలిపారు. చిన్నబాబు ఫోన్ లొకేషన్ గురువారం రాత్రి 10 గంటల వరకు ఆదోని కొత్తబస్టాండు సమీపంలో చూపించిందని, తిరిగి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చూపించిందని తెలియజేశారు.