ఆర్థికాభివృద్ధికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

ABN , First Publish Date - 2021-12-04T05:48:00+05:30 IST

ఆర్థికాభివృద్ధికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

ఆర్థికాభివృద్ధికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్‌ అంజిలప్ప

షాద్‌నగర్‌అర్బన్‌: వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్న రైతుల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇస్తోందని రంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ అంజిలప్ప తెలిపారు. షాద్‌నగర్‌ పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన రైతుల అవగాహన సమావేశానికి డాక్టర్‌ అంజిలప్ప హాజరై పథకం వివరాలను వెల్లడించారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న పాడి, పౌలీ్ట్ర రైతులతో పాటు మత్స్యకారులను ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం ఆత్మ నిర్బర్‌ భారత్‌ పథకం కింద కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇస్తోందని తెలిపారు. కనిష్టంగా లక్షా 60వేలు, గరిష్టంగా మూడు లక్షల వరకు తమ బ్యాంక్‌ ఖాతాల నుంచి వాడుకోవచ్చని తెలిపారు. క్రెడిట్‌ కార్డుతో పాడి పశువుల కొనుగోలు, పశుగ్రాసం, దాణ కొనుగోలు చేయవచ్చని తెలిపారు. కెడ్రిట్‌ కార్డులు అవసరమున్న రైతులు జిల్లా పశువైద్యాధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం నుంచి దరఖాస్తులు తీసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం రిజ్వాన్‌, జిల్లా మత్స్యశాఖ అధికారిణి సుకీర్తి, ఏడి డాక్టర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, విజయ డెయిరీ డిడి శివాల్కర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి 

ఆమనగల్లు/షాద్‌నగర్‌ అర్బన్‌/కొత్తూర్‌: రైతులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి కోరారు. ఆమనగల్లు మార్కెట్‌ యార్డులో శుక్రవారం యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆరుతడి పంటలసాగుకు సంబంధించి రూపొందించిన వాల్‌పోస్టర్లను రైతులు, మార్కెట్‌ కమిటీసభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి, తుమ్మలకుంట తండాలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైస్‌ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ జయమ్మవెంకటయ్య, ఏవో రాజు, ఏఈవోలు శ్రీకాంత్‌, శివుడు, విజయ్‌, నాగేశ్వరి, రేణురెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఏడీఏ రాజారత్నం, మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్‌లు సందర్శించి వడ్ల తేమ శాతాన్ని, తూకాలను పరిశీలించారు. తేమ శాతం 17లోపు ఉన్న వడ్లను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సంచుల కొరత ఉందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మొగిలిగిద్ద లక్ష్మీ రైస్‌మిల్లు గోదాంకు, ఇన్ముల్‌నర్వ సత్యనారాయణ రైస్‌మిల్లు గోదాములకు పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తూర్‌లోని ఇన్ముల్‌నర్వ, తీగాపూర్‌లోమండల వ్యవసాయాధికారి గోపాల్‌ పర్యటించి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. మంజులారెడ్డి, రమాదేవి, మెండె కృష్ణ పాల్గొన్నారు.  

రైతుల సమస్యలు పట్టని పాలకులు 

మంచాల: రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. అవసరమైన విత్తనాలను అందించాలన్నారు. అనంతరం ఆరుట్లలో శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లింగపల్లి గేటువద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమాల్లో జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐల్లయ్యయాదవ్‌, తెలుగుదేశం భుదనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణమాచారి, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జలమోని రవీందర్‌, ఆరుట్ల సర్పంచ్‌ కొంగర విష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు ఇందిర, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:48:00+05:30 IST