రైతుల పార్లమెంటు : జంతర్ మంతర్‌కు రోజుకు 200 మంది రైతులు

ABN , First Publish Date - 2021-07-21T16:48:48+05:30 IST

ప్రభుత్వానికి పార్లమెంటు లోపల, బయట పెద్ద

రైతుల పార్లమెంటు : జంతర్ మంతర్‌కు రోజుకు 200 మంది రైతులు

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి పార్లమెంటు లోపల, బయట పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతోంది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై చర్చించాలంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉభయ సభల్లోనూ డిమాండ్ చేస్తుండగా, పార్లమెంటు వెలుపల రైతులు తమ నిరసన గళం తీవ్రతను మరింత పెంచబోతున్నారు. జూలై 22 నుంచి రైతుల పార్లమెంటును జంతర్ మంతర్ వద్ద నిర్వహించబోతున్నారు. 


కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు ఎనిమిది నెలల నుంచి ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో తమ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సింఘు సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రైతు సంఘాలు రోజుకు 200 మంది చొప్పున రైతులను జంతర్ మంతర్‌కు తరలించాలని నిర్ణయించాయి. 


రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తాము జంతర్ మంతర్ వద్ద రైతుల పార్లమెంటును నిర్వహిస్తామని చెప్పారు. జూలై 22 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి రోజూ 200 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రతి రోజూ ఓ స్పీకర్‌ను, ఓ డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసుకుంటామని చెప్పారు. మొదటి రెండు రోజుల్లో ఏపీఎంసీ యాక్ట్‌పై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత మిగిలిన చట్టాలపై కూడా రెండేసి రోజులపాటు చర్చిస్తామని తెలిపారు. 


రైతు సంఘాల నేతలు మంగళవారం ఢిల్లీ పోలీసులతో సమావేశమయ్యారు. తాము పార్లమెంటుకు వెళ్ళబోమని, జంతర్ మంతర్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పినట్లు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ శివ కుమార్ తెలిపారు. 


సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూలు ప్రకారం ఆగస్టు 13 వరకు జరుగుతాయి.


Updated Date - 2021-07-21T16:48:48+05:30 IST