అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయాం: కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2021-12-05T16:24:31+05:30 IST
రోశయ్య మరణం తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయామన్నారు. రోశయ్య ఆర్థిక నిపుణుడు, అద్భుత మేధావి అని కొనియాడారు. తాను శాశనసభ చూడాలనుకున్నపుడు మొదట రోశయ్యనే చూశానన్నారు. రామారావు, రోశయ్య చాలా సన్నిహితంగా ఉండేవారన్నారు. తాను విద్యార్థి దశ నుంచే ఎంతో నేర్చుకున్నానన్నారు.
2004 నుంచి 2014 వరకు అసెంబ్లీలో కలిసి పని చేశామని, తాను బీజేపీ పక్ష నేతగా ఉన్నపుడు రోశయ్య శాశనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయ శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళమన్నారు. అసెంబ్లీ లోపల, బయట వైఎస్కు రోశయ్య కవచంలా ఉండేవారన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడు కూడా తమకు చాలా సమయం ఇచ్చేవారని, ఆయన కుటుంబతో తమకు చాలా దగ్గరి సంబంధం ఉందన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి కిషన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.