కిశోర్ హత్య కేసులో మహిళా హోంగార్డు సహా ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-15T17:37:51+05:30 IST
పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన గారా కిశోర్ హత్య కేసులో మహిళా..
నర్సీపట్నం(విశాఖపట్నం): పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన గారా కిశోర్ హత్య కేసులో మహిళా హోంగార్డుతో పాటు ఆమె స్నేహితురాలిని పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి సీఐ స్వామి నాయుడు పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాలివి. ఎస్సీ కాలనీకి చెందిన నర్సింగరావు ఈ నెల 7న తన కుమారుడు కిశోర్ (19) కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని తెలిపారు. ఈనెల 10న పెద్ద చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కాగా, అది కిశోర్దని తండ్రి గుర్తించినట్టు పేర్కొన్నారు. తన కుమారుడు ఓ అమ్మాయిని ప్రేమించాడని, ఆమె తల్లిదండ్రులే చంపి చెరువులో పడేసి ఉంటారని నర్సింగరావు ఫిర్యాదు చేశారని సీఐ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రియురాలు తల్లి కురసం గీత, ఆమె స్నేహితురాలు చిటికెల కృష్ణవేణిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వివరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ విడిచిపెట్టే ప్రశక్తే లేదని సీఐ స్పష్టం చేశారు.