మధుమేహ రోగులు ఎండుద్రాక్ష తినడం వల్ల..

ABN , First Publish Date - 2020-05-19T18:30:24+05:30 IST

ద్రాక్షపండ్ల ఉపయోగాలేమిటి? ఎండుద్రాక్ష అందరూ తినవచ్చా?

మధుమేహ రోగులు ఎండుద్రాక్ష తినడం వల్ల..

ఆంధ్రజ్యోతి(19-05-2020):

ప్రశ్న: ద్రాక్షపండ్ల ఉపయోగాలేమిటి? ఎండుద్రాక్ష అందరూ తినవచ్చా?


- బాలకృష్ణ, విజయవాడ


డాక్టర్ సమాధానం: వంద గ్రాముల ద్రాక్షలో కేవలం 80 కెలోరీల శక్తి ఉంటుంది. విటమిన్‌ ‘సి’, విటమిన్‌ ‘కె’ పుష్కలం. మధుమేహం, గుండె పోటు, కాన్సర్‌ లాంటి వ్యాధుల బారి నుంచి రక్షించు కొనేందుకు ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర వృక్షసంబంధ రసాయనాలు ద్రాక్షలో అధిక మొత్తంలో ఉంటాయి. ఎర్ర ద్రాక్ష, నల్ల ద్రాక్షలో ఉన్న రిజర్వేటాల్‌ అనే రసాయనం పెద్ద ప్రేవుల కాన్సర్‌, బ్రెస్ట్‌ కాన్సర్‌లను అడ్డగిస్తుంది. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ఫ్లేవనాయిడ్లు అంటారు. వీటికి కూడా ఎర్ర ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లకు ధీటుగా పనిచేసే శక్తి ఉంది. భావోద్వేగాలను నియంత్రించడంలో, మెదడు పనితీరును ప్రభావితం చేయడంలో ఉపకరించే విటమిన్‌ ‘బి-6’ ద్రాక్షలో అధికం. ద్రాక్షలో చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉన్నా, ఇవి తక్కువ - మధ్యరకం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారపదార్థాలు. కాబట్టి ప్రమాదకరం కాదు. అందుకే మధుమేహ రోగులు వీటిని తక్కువ మొత్తంలో తినవచ్చు. ప్రయోజనాలన్నీ పొందాలంటే ద్రాక్షను పళ్లుగానే తినడం మంచిది, చక్కెర కలిపి జ్యూస్‌గా చేయడం వల్ల లాభాలు తగ్గుతాయి. ఎండు ద్రాక్షలో ప్రయోజనాలెన్నో. అయితే 100గ్రా ఎండు ద్రాక్షలో 300 కెలోరీలు, 70గ్రాముల చక్కెరలు ఉంటాయి.  మధుమేహం ఉన్నవారు రోజుకు 10గ్రాముల కన్నా తక్కువ తీసుకోవాలి. అయితే వైట్‌ బ్రెడ్‌, తెల్ల బియ్యం, తదితర పదార్థాలతో పోల్చినపుడు ఇది మధుమేహ నియంత్రణలో మెరుగైన ఫలితాలనిస్తాయి. కాబట్టి మధుమేహ రోగులు ఎండు ద్రాక్షను చిరుతిండిగా తీసుకోవడం మంచిదే.   


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2020-05-19T18:30:24+05:30 IST