న్యూజిలాండ్ ఖాతాలో ఒకే రోజు రెండు రికార్డులు.. ఒకటి గొప్ప, మరోటి చెత్త!
ABN , First Publish Date - 2021-12-04T23:32:05+05:30 IST
భారత్తో ముంబైలో జరుగుతున్న చివరి టెస్టులో న్యూజిలాండ్ ఒకే రోజు రెండు రికార్డులు సృష్టించింది. అందులో..
ముంబై: భారత్తో ముంబైలో జరుగుతున్న చివరి టెస్టులో న్యూజిలాండ్ ఒకే రోజు రెండు రికార్డులు సృష్టించింది. అందులో ఒకటి ఘనమైన రికార్డు కాగా, రెండోది అత్యంత చెత్త రికార్డు. భారత తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్లను నేలకూల్చిన కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డులకెక్కాడు. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. 62 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకుంది. భారత గడ్డపై ఓ జట్టు సాధించిన అత్యంత తక్కువ పరుగులు ఇవే. అంతకుముందు 1987లో ఢిల్లీలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇండియా 75 పరుగులకు ఆలౌట్ అయింది. 2008లో అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత్ 76 పరుగులకు ఆలౌట్ అయింది.2015లో నాగ్పూర్లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక, ఇండియాపై ఓ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం. తాజా మ్యాచ్లో కివీస్ 62 పరుగులకు ఆలౌట్ కాగా, 2015లో నాగ్పూర్లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్ అయింది. 2021లో అహ్మదాబాద్లో ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌట్ అయింది.1990లో చండీగఢ్లో భారత్తో జరిగిన టెస్టులో శ్రీలంక 82 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పుడు రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ న్యూజిలాండ్ 62 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓవరాల్గా చూసినా భారత్పై న్యూజిలాండ్ సాధించిన అత్యల్ప స్కోరు కూడా ఇదే. 2002లో హమిల్టన్లో భారత్తో జరిగిన మ్యాచ్లో కివీస్ 94 పరుగులు చేసింది. 1981లో వెల్లింగ్టన్లో 100, 1968లో ఆక్లాండ్లో 101 పరుగులు చేసింది. వాంఖడేలో నమోదైన అతి తక్కువ స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం. ఇక్కడ 2004లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 93 పరుగులకు ఆలౌట్ అయింది. 2006లో ఇంగ్లండ్పై భారత్ 100 పరుగులు చేసింది.1981లో ఇంగ్లండ్ 102 పరుగులుచేయగా, 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 104 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తాజా మ్యాచ్లో న్యూజిలాండ్ 62 పరుగులకే కుప్పకూలి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.