శుద్ధి ‘జల దోపిడీ’

ABN , First Publish Date - 2020-09-25T11:11:53+05:30 IST

కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా మినరల్‌ వాటర్‌ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆ

శుద్ధి ‘జల దోపిడీ’

రింగైన వాటర్‌ప్లాంట్‌ యజమానులు

నిబంధనలు పాటించని వైనం

20లీటర్ల క్యాన్‌ ధర రూ.15నుంచి రూ.20

‘మిషన్‌భగీరథ’పై ఆసక్తి చూపని జనం


కల్లూరు, సెప్టెంబరు 24: కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా మినరల్‌ వాటర్‌ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఆయా వాటర్‌ప్లాంట్ల యజమానులు ప్రజలకు నీటిని అందించే విషయంలో ధరలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ శుద్ధిజల సంస్థ నిబంధనలు, అనుమతులు లేకుండా వ్యాపార దృక్పథంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో మినరల్‌ వాటర్‌ఫ్లాంట్లు స్థాపించి యథేచ్ఛగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.


శుద్దిజల వాటర్‌ఫ్లాంట్‌ యజమానులు నాణ్యతాప్రమాణాలను తుంగలో తొక్కి వ్యాపారం సాగిస్తున్నారు. కల్లూరు పరిసర ప్రాంతాల్లోని మినరల్‌ వాటర్‌ప్లాంట్లలో 20లీటర్ల క్యాన్‌ గృహాలకు చేరవేస్తే రూ.15నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. శుద్ధిజల నీటివాడకానికి సంబంధించి యజమానులు ధరలు పెంచటంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.


కరోనా ప్రభావం దృష్ట్యా వాటర్‌ఫ్లాంట్‌ యజమానులు రింగై పైవిధంగా ధరలు పెంచి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులు ఏనాడూ కూడా ప్లాంట్లను సందర్శించి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్‌ఫ్లాంట్ల నిర్వహణలో శుద్ధిజల సంస్థ నిబంధనలు పాటించేలా, ధరలు అదుపులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మిషన్‌ భగీరథ నీటిపై ఆసక్తి చూపని ప్రజలు

రాష్ట్రప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగేందుకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా శుద్ధిజల నీటిని సరఫరా చేస్తుంది. ఆనీటిని తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపని పరిస్థితి. గ్రామాల్లో అందుకుగల ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులు నీటిని తాగేవిషయమై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో ముందుకురాని పరిస్థితి. దీంతో గ్రామాల్లో నిబంధనలను విస్మరించి పుట్టగొడుగుల్లా వెలిసిన వాటర్‌ఫ్లాంట్లపైనే ప్రజలు ఆసక్తి చూపటం గమనార్హం.

Updated Date - 2020-09-25T11:11:53+05:30 IST