నేటి నుంచి బాదుడు
ABN , First Publish Date - 2020-08-12T09:43:37+05:30 IST
కరోనా కష్టాలు వెంటాడుతున్న వేళ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. జిల్లా వ్యాప్తంగా 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం నుంచి కొత్త చార్జీలు వసూలు చేయనున్నారు. రిజి
కుడా పరిధిలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
594 గ్రామాల పరిధిలో భూములకు వర్తింపు
కొవిడ్ సంక్షోభ సమయంలో నెత్తిన పిడుగు
కర్నూలు(అర్బన్), ఆగస్టు 11: కరోనా కష్టాలు వెంటాడుతున్న వేళ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. జిల్లా వ్యాప్తంగా 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం నుంచి కొత్త చార్జీలు వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పెంపులో కూడా వ్యత్యాసం కనబడుతోంది. కొన్ని చోట్ల 20 నుంచి 30 శాతం, మరికొన్ని చోట్ల 50 శాతం పెంచారు. పట్టణ ప్రాంతాలకే పెంపు పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
కుడా పరిధిలో భారీగా
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలోని 594 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలను 50 శాతం పెంచారు. కర్నూలులో 544, నంద్యాల 50 డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పొలానికి మార్కెట్ విలువ రూ.2 లక్షల వరకు పెంచడంపై విమర్శలు వ్య్తమవుతున్నాయి. ఈ మేరకు ఎకరాకు 7.5 శాతం ఫీజు కింద రూ. 15వేలు చెల్లించాల్సి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
భూముల విలువ పెంపు
జిల్లాలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. అధికారులు ఆన్లైన్లో నమోదును పూర్తి చేశారు. ఈ ప్రక్రియ సోమవారం ప్రారంభం కావల్సిన ఉండగా సర్వర్ మొరాయించింది. దీంతో బుధవారం నుంచి అమలులోకి రానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పతనమైంది. ఈ పరిస్థితుల్లో చార్జీల పెంపు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. కొన్ని కారణాలతో పరి రోజుల పాటు అలస్యమైంది.
ఆదాయం కోసం
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో భాగంగా రిజిస్ట్రేషన్ చార్జీలను గ్రామాల్లో రెండేళ్లకు ఒక సారి, పట్టణాల్లో ఏటా ఒక సారి సవరిస్తుంది. బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలను బట్టి వీటిని పెంచుతారు. 2018-19లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది రాష్ట్రంలో ఎక్కడా భూములు, స్థలాలు, అపార్టుమెంట్ల విలువలు పెరగలేదనేది బహిరంగ రహస్యం.
కొత్త ప్రభుత్వం కారణంగా ఆరంభంలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. రాజధాని మార్పు, ఇసుక కొరత తదితర ఇబ్బందులు తలెత్తాయి. ఆ తరువాత కరోనా ప్రభావంతో ధరల పెరుగుదల లేదు. ఒకటి రెండు చోట్ల మినహ జిల్లా అంతటా ఇదే పరిస్థితి. వాస్తవ విలువలు ఏమాత్రం పెరగపోయినా రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నేటి నుంచి అమలు
ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయి. మొదటి రోజు సోమవారం సర్వర్ పని చేయలేదు. దీంతో కొత్త ధరలు అమలులోకి రాలేదు. కుడా పరిధిలోని 594 గ్రామాల్లో ఎకరం పొలం అమ్మకానికి రూ.2 లక్షల చార్జీలు వసూలు చేయబోతున్నాం.
- నాగభూషణం, డీఆర్