పెట్టుబడి సాయం.. పరిహారం
ABN , First Publish Date - 2020-10-28T08:47:05+05:30 IST
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం, ఖరీఫ్ ఇన్ఫుట్ సబ్సిడీ చెల్లింపును సీఎం జగన్ ప్రారంభించారు.
రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ
తాడేపల్లి నుంచి పారంభించిన సీఎం
కర్నూలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం, ఖరీఫ్ ఇన్ఫుట్ సబ్సిడీ చెల్లింపును సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 4,96,195 మంది రైతులకు పెట్టుబడి సాయం రూ.104,85,91,500 చెక్కు, ఈ ఖరీఫ్లో అధిక వర్షాలకు నష్టపోయిన 47,695 మంది రైతులకు రూ.38.14 కోట్ల చెక్కును రైతులకు అందజేశారు. ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని సీఎం జగన్కు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పెట్టుబడి సాయం ఈ ఏడాది 6 శాతం (27,209 మంది) రైతులు ఎక్కువగా అందుకున్నారని తెలిపారు.
రైతులకు నష్టపరిహారం, పెట్టుబడి సాయం ఒకేసారి అందడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి జేసీ, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయించారని, గ్రామ సచివాలయాల్లో నష్టపోయని రైతుల జాబితా ప్రదర్శించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ రవి పట్టన్ శెట్టి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, కంగాటి శ్రీదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, రైతులు పాల్గొన్నారు.