విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్‌ కాళ్లు పట్టుకోవచ్చు కదా! : నాని

ABN , First Publish Date - 2020-09-19T20:01:22+05:30 IST

ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు...

విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్‌ కాళ్లు పట్టుకోవచ్చు కదా! : నాని

అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. అమరావతి భూముల వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నాని మాట్లాడుతూ.. ‘విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకోవచ్చు కదా!’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన.. అప్పట్లో వైఎస్‌ కాళ్లు పట్టుకొని విచారణలు ఆపించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని.. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారని నాని మరోసారి చెప్పుకొచ్చారు. అందుకే తమ ఆస్తులను కాపాడుకునేందుకే అమరావతినే రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందే చెప్పామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నాని తెలిపారు.


కేంద్రానికి జగన్ లేఖ..

కొందరి స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని వ్యవస్థల పనితీరుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయన్నారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారని మీడియా ముఖంగా తెలిపారు. ఏ రాజకీయ నేత తీసుకోలేని నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారని.. ప్రజలకు మేలు చేయాలనే ఆయన నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. పార్లమెంట్ ఈ భూముల విషయం చర్చకు రాకుండా టీడీపీ సిగ్గులేకుండా అడ్డుకుంటోందని నాని విమర్శించారు. కేవలం తాను, తన సామాజిక వర్గమన్నదే చంద్రబాబు లక్షణమని మంత్రి విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-09-19T20:01:22+05:30 IST