భార్యపై అనుమానంతో.. అందరూ నిద్రిస్తున్న సమయంలో..
ABN , First Publish Date - 2020-07-30T16:33:51+05:30 IST
భార్యపై అనుమానంతో..
అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి
చికిత్స పొందుతూ గుంటూరులో మృతి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
పీసీపల్లి(ప్రకాశం): భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన ఈ నెల 23న మండలంలోని తురకపల్లిలో జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పీసీపల్లి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి చెందిన కూచిపూడి కొండయ్య, బాలమ్మలు దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి.
కొండయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ మద్యం సేవించి వచ్చి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. ఇటీవల కొండయ్య తన కుటుంబాన్ని పీసీపల్లి మండలం తురకపల్లికి మార్చారు. ఇక్కడకొచ్చినా భార్యపై వేధింపులు ఆగలేదు. ఈ నెల 23న రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు.
అదేరోజు తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య తలపై గొడ్డలితో దాడి చేశాడు. అలికిడికి మేల్కొన్న కొడుకు నాగయ్య గాయపడిన తల్లిని చికిత్స కోసం కనిగిరి, ఒంగోలు ఆసుపత్రికి తీసుకొచ్చాడు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ బాలమ్మ మంగళవారం రాత్రి మృతి చెందింది. అక్కడి హాస్పిటల్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసి పీసీపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ మధుసూదన్రావులు గుం టూరు జీజీహెచ్లో ఉన్న బాలమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. నాగయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశారు. సీఐ వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.